హైదరాబాద్, మే 2 (నమస్తే తెలంగాణ): ఈటల రాజేందర్ ఆక్రమణల పర్వం ఆధారాలతో సహా రుజవైంది. ఈటల, ఆయన అనుచరులు మెదక్ జిల్లా మాసాయిపేట మండటం అచ్చంపేట, హకీంపేటలో ఏకంగా 66.01 ఎకరాలు చెరబట్టారని ప్రత్యేక కమిటీ తేల్చింది. బడుగు, బలహీన వర్గాలకు చెందిన నిరుపేద రైతులను బెదిరించి వారి భూములను గుంజుకున్నారని ఈటలపై ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో వాటిపై విచారణకు సీఎం కేసీఆర్ ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు సీఎస్ సోమేశ్కుమార్ ఏర్పాటుచేసిన విచారణ కమిటీ..
తన నివేదికను సమర్పించింది. ఈ నేపథ్యంలో ఈటల రాజేందర్ను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేశారు. సీఎస్ ఆదేశాలతో మెదక్ జిల్లా కలెక్టర్ హరీశ్, విజిలెన్స్ ఎస్పీ మనోహర్ నేతృత్వంలోని ప్రత్యేక కమిటీ శనివారం బాధిత గ్రామాల్లో పర్యటించింది. వివాదాస్పద భూములు, జమున హ్యాచరీస్ విస్తరించిన ఉన్న భూములను కొలువడంతోపాటు బాధిత రైతులతో మాట్లాడి వివరాలను సేకరించింది. ఆరు పేజీల సమగ్ర నివేదికను మెదక్ కలెక్టర్ హరీశ్ శనివారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్కు పంపించారు. ఈ నివేదిక ఆదివారం వెలుగులోకి వచ్చింది. ఇందులో ఈటల రాజేందర్ ఆక్రమణల పర్వాన్ని వివరించారు.
బామ్మర్ది బెదిరింపులు
విచారణ కోసం వెళ్లిన ఉన్నతాధికారుల వద్దకు బాధితులు క్యూ కట్టారు. మంత్రి ఈటలపై ఫిర్యాదు చేసినవారితోపాటు భయంతో ఇన్నాళ్లూ నోరు మెదపనివారు సైతం ధైర్యంగా ముందుకొచ్చి, తమ గోడును వెళ్లబోసుకున్నారు. ఈ సందర్భంగా అధికారులు 20 మంది నుంచి వివరాలు సేకరించారు. వారందరిదీ ఒకే కథ. ప్రభుత్వం అసైన్ చేసిన భూమి నుంచి తమను ఈటల అనుచరులు, ఆయన బామ్మర్ది సూరి బలవంతంగా ఖాళీ చేయించడమే కాకుండా.. సొమ్ము కూడా పూర్తిగా చెల్లించలేదని బాధితులు కమిటీ ముందు గోడు వెళ్లబోసుకున్నారు. ఈ వాంగ్మూలాలను బట్టి ఆక్రమణల పర్వంలో ఈటల కుటుంబంతోపాటు రాజేందర్ బామ్మర్ది సూరి అలియాస్ సురేశ్ కీలకపాత్ర పోషించినట్టు తేలింది. రోడ్డు, బిల్డింగ్లు, షెడ్లు, ప్లాట్ఫారాల నిర్మాణానికి కావాల్సిన రాళ్లు, మట్టి కోసం ఈటల, ఆయన అనుచరులు పలువురు రైతులను బెదిరించారని, వారి భూముల్లో 3-18 ఫీట్ల లోతు వరకు అక్రమంగా తవ్వకాలు జరిపారని తేలింది.
54 శాతం భూములు ఆక్రమించినవే
హకీంపేట, అచ్చంపేట శివార్లలో జమున హ్యాచరీస్ 121.27 ఎకరాల్లో విస్తరించి ఉన్నది. హకీంపేటలోని సర్వే నంబర్ 97, అచ్చంపేటలోని 77, 78, 79, 80, 81, 82, 130 సర్వే నంబర్లలో ఉన్న 66.01 ఎకరాల భూమి (దాదాపు 54%)ని కబ్జా చేసినట్టు నివేదిక వెల్లడించింది. ఇది ‘తెలంగాణ అసైన్డ్ ల్యాండ్ (పీవోటీ) యాక్ట్-1977’ ప్రకారం నేరమని కమిటీ నిర్ధారించింది. చట్టంలోని నిబంధనలకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని సూచించింది. ‘తెలంగాణ నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ కన్వర్షన్ యాక్ట్-2006’ ప్రకారం చర్యలు తీసుకోవాలి. రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రకారం నష్టాన్ని జమున హ్యాచరీస్ నుంచి వసూలు చేయాలని సిఫారసు చేసింది. హ్యాచరీస్ కోసం అసైన్డ్ భూముల గుండా కచ్చా రోడ్డు వేసేందుకు ఎలాంటి అనుమతులు లేకుండా అనేక చెట్లను నరికివేశారని, ఇందుకు ‘అటవీ చట్టం-1980’ ప్రకారం తగిన చర్యలు తీసుకోవాలని సూచించింది.
ఈటల బర్తరఫ్
రాష్ట్ర మంత్రివర్గం నుంచి ఈటల రాజేందర్ బర్తరఫ్ అయ్యారు. ముఖ్యమంత్రి సలహా మేరకు మంత్రివర్గం నుంచి ఈటల రాజేందర్ను తొలగిస్తున్నట్టు గవర్నర్ కార్యాలయం ఆదివారం ఉత్తర్వులు జారీచేసింది. ఈ ఉత్తర్వులు తక్షణం అమలులోకి వస్తాయని స్పష్టం చేసింది. ఈటలపై వచ్చిన ఆరోపణలపై సీఎం ఆదేశాల మేరకు విచారించిన కమిటీ.. తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. ఈటల భూ ఆక్రమణ నిజమేనని అందులో నిర్ధారించింది. విజిలెన్స్ అధికారులు కూడా ప్రాథమిక నివేదికను ప్రభుత్వానికి అందించారు. వీటి ఆధారంగానే సీఎం కేసీఆర్ రాష్ట్ర మంత్రివర్గం నుంచి ఈటల రాజేందర్ను తొలగించాలని నిర్ణయించి, గవర్నర్కు సిఫారసు చేశారు. గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్ ఈటలను బర్తరఫ్ చేస్తూ ఆదివారం ఆదేశాలు జారీచేశారు. 2014లో తొలిసారి ఏర్పడిన తెలంగాణ ప్రభుత్వంలో ఆరోగ్యశాఖ మంత్రిగా పనిచేసిన టీ రాజయ్య కూడా పలు ఆరోపణల నేపథ్యంలోనే బర్తరఫ్ అయిన విషయం తెలిసిందే. తాజాగా ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్న ఈటల రాజేందర్ కూడా బర్తరఫ్కు గురికావడం గమనార్హం.
రెండో రోజూ కొనసాగిన విచారణ
వెల్దుర్తి: ఈటల రాజేందర్ భూకబ్జాపై రెండో రోజు ఆదివారం మాసాయిపేట తహసీల్దార్ కార్యాలయంలో రికార్డులను పరిశీలించారు. మరోవైపు జమున హేచరీస్ పరిశ్రమ నిర్మాణంలో కబ్జాకు గురైన ప్రభుత్వ సీలింగ్, అసైన్డ్ భూముల్లో రెవెన్యూ అధికారులు ఆదివారం బోర్డులను ఏర్పాటు చేశారు. అచ్చంపేట గ్రామ శివారులోని కోళ్ల పరిశ్రమల వెనుకభాగంలో సర్వే నం.130, సర్వే నం. 81, సీలింగ్ భూ ముల్లో నుంచి వేసిన రోడ్డులో సర్వే నంబర్లు 77, 78, 79, 80లో ప్రభుత్వ భూమి బోర్డులను ఏర్పాటు చేసినట్టు సర్వేయర్ నర్సింలు తెలిపారు. ప్రభుత్వ భూముల్లోంచి సుమారు రెండు కిలోమీటర్ల మేర మట్టి రోడ్డు నిర్మాణంలో భాగంగా నరికివేసిన చెట్లను చిన్నశంకరంపేట సెక్షన్ అధికారి ఆజం పరిశీలించారు.