న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలకు ఇంకా రెండు రోజుల సమయం ఉంది కానీ అప్పుడే ఎగ్జిట్ పోల్స్ వీటిపై ఓ అంచనా చెప్పేశాయి. దేశమంతా ఆసక్తిగా చూసిన పశ్చిమ బెంగాల్పై మాత్రం సర్వే సంస్థలు స్పష్టంగా చెప్పలేకపోయాయి. ఎగ్జిట్ పోల్స్ నిర్వహించిన చాలా వరకు సంస్థలు తృణమూల్ కాంగ్రెస్ వైపే బెంగాల్ ఉందని చెప్పగా.. రిపబ్లిక్ టీవీ-సీఎన్ఎక్స్, జన్కీ బాత్ మాత్రమే బీజేపీకి ఆధిక్యం రావచ్చని అంచనా వేశాయి. అదే సమయంలో ఈసారి అస్సాంలో మరోసారి బీజేపీదే అధికారమని ఎగ్జిట్ పోల్స్ అన్ని తేల్చేశాయి.
అయితే రెండింట్లో తనకు అనుకూలంగా ఉన్న అస్సాం ఎగ్జిట్పోల్స్ను స్వాగతించిన బీజేపీ.. పశ్చిమ బెంగాల్వి మాత్రం తప్పని వాదిస్తోంది. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి, పశ్చిమ బెంగాల్ ఇన్చార్జ్ కైలాష్ విజయ్వర్ఘియా ఈ ఎగ్జిట్ పోల్స్పై స్పందించారు. ఈ కంపెనీలు బెంగాల్లో ప్రజల అభిప్రాయాన్ని తీసుకుని వెల్లడించే ఎగ్జిట్ పోల్స్ పూర్తిగా వాస్తవాన్ని గ్రహించలేవు. బెంగాల్లో హింస ఎక్కువ. ఇక్కడ అధికార పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడే సాహసం చాలా మంది చేయరు. ఇక్కడ సైలెంట్ ఓటర్లు ఎక్కువ. వాళ్లు కనీసం 18 నుంచి 20 శాతం ఉంటారు అని ఆయన అన్నారు.
2011లోనూ ఇలాగే లెఫ్ట్ వస్తుందని అంచనా వేసినా, టీఎంసీ అధికారంలోకి వచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అధికారంలో ఉన్న పార్టీకి ఓటేసిన వాళ్లు ధైర్యం చెబుతారు తప్ప ప్రతిపక్షానికి వేసిన వాళ్లు చెప్పలేరు అని విజయ్వర్ఘియా అన్నారు. తాజా ఎన్నికల్లో బీజేపీ 140లోపు స్థానాలే సాధిస్తుందని మెజార్టీ సర్వే సంస్థలు అంచనా వేశాయి.
మరోవైపు అస్సాంలో మాత్రం బీజేపీకి పూర్తి అనుకూల ఫలితాలను ఎగ్జిట్ పోల్స్ చూపించాయి. ప్రతి సంస్థ బీజేపీదే అధికారం అని తేల్చాయి. ఈ అంచనాలను మాత్రం ఆ పార్టీ స్వాగతించింది. గత ఐదేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం చేసిన అభివృద్ధికి ప్రజలు పట్టం కట్టబోతున్నారని ఆ పార్టీ అధికార ప్రతినిధి కేకే శర్మ చెప్పారు.