అనవసరంగా అవాకులు , చవాకులు పేలకు..
టీఆర్ఎస్ గెలుస్తుందని జీర్ణించుకోలేకపోతున్నావా?
సానుభూతి కోసం కొత్త నాటకాలకు తెరతీస్తున్నావా?
కలెక్టరేట్లో మీరు ప్రెస్మీట్ పెట్టడం ఉల్లంఘన కాదా?
సీఎల్పీ నేత విక్రమార్కపై మంత్రి అజయ్కుమార్ ధ్వజం
ఖమ్మం, ఏప్రిల్ 29: వాస్తవిక పరిస్థితులు తెలుసుకోకుండా అవాకులు, చవాకులు పేలితే సహించేది లేదని సీఎల్పీ నేత భట్టిపై రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ధ్వజమెత్తారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు ప్రజాస్వామ్య పద్ధతిలో జరగడం లేదని, పోలీసుస్వామ్యంలో ఎలెక్షన్లు జరుగుతున్నాయని భట్టి చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని అన్నారు. కేఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్కు ఘోర పరాభవం జరగబోతుందని గ్రహించిన విక్రమార్క వాస్తవాలు కప్పిపుచ్చి తమపై ఆరోపణలుచేయడం బాధాకరమని అన్నారు. ఎన్నికల నియమావళిని టీఆర్ఎస్ ఉల్లంఘించిందని ఆరోపణలు చేస్తున్న భట్టి.. ఖమ్మం కలెక్టరేట్లో ప్రెస్మీట్ నిర్వహించడం ఉల్లంఘన కాదా? అన్ని ప్రశ్నించారు. ఖమ్మం నగరంలో గురువారం కాంగ్రెస్ అభ్యర్థులు, నాయకులు ఓటర్లకు నేరుగా డబ్బులు పంపిణీ చేస్తున్నారన్న విషయంపై పోలీసులు కాంగ్రెస్ నాయకులను అరెస్టు చేస్తే తమకేం సంబంధమని మంత్రి అన్నారు.
అలాంటి విషయాల గురించి టీఆర్ఎస్పై అభియోగాలు మోపడం భట్టికి సర్వసాధారణంగా మారిందన్నారు. కాంగ్రెస్ అభ్యర్థులు డబ్బులు పంచుతుండగా దొరికిపోయి మళ్లీ తిరిగి తమపై కలెక్టర్కు ఫిర్యాదు చేయడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. వాస్తవాలు తెలియకుండా అనుచిత వ్యాఖ్యలు, ఆరోపణలు చేస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ గురించి తనకంతా తెలుసునని, ఆ పార్టీ అంతర్గత విషయాలపై తాను నోరు విప్పబోనని అజయ్ అన్నారు. అయితే తాను కూడా ఆ పార్టీ గురించి నోరు తెరిస్తే మీరు మొహం ఎక్కడ పెట్టుకుంటారని మంత్రి ప్రశ్నించారు. ముఖ్యంగా ఎన్నికల్లో టీఆర్ఎస్ బంపర్ మెజార్టీతో గెలిచి మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంటుందని స్పష్టం చేశారు. ఈ వాస్తవాన్ని జీర్ణించుకోలేని భట్టి.. కొత్త నాటకానికి తెరతీసి సానుభూతిని పొందే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. శుక్రవారం జరిగే ఎన్నికల్లో ప్రజలు తగిన సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. భట్టి చెప్పే ఒట్టి మాటలు నమ్మే రోజులు పోయాయయని, మిమ్మల్ని ఎక్కడ ఉంచాలో ప్రజలే నిర్ణయిస్తారని అన్నారు.