త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా అందుబాటులోకి..
అగ్రికల్చర్ వర్సిటీ ఉప కులపతి డాక్టర్ ప్రవీణ్రావు
వ్యవసాయ యూనివర్సిటీ: రైతులకు ఆధునిక సాఫ్ట్వేర్ టెక్నాలజీని వినియోగించి మెరుగైన సాంకేతిక సలహాలు అందించేందుకు, హైదరాబాద్కు చెందిన ప్రతిమ అగ్రి సర్వీసెస్ మంగళవారం ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకోవడం అభినందనీయమని అగ్రి ఉపకులపతి డా॥ ప్రవీణ్రావు తెలిపారు. వర్చ్యువల్ విధానంలో ఈ అవగాహన ఒప్పంద కార్యక్రమం ఉప కులపతి డా॥ ప్రవీణ్ రావు సమక్షంలోమంగళవారం జరిగింది. ఈ ఒప్పంద పత్రాలపై విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ సుధీర్ కుమార్, ప్రతిమ అగ్రి రిసెర్చ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అధికారి రమణారావు సంతకాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ..రానున్న రోజుల్లో ఈ -రైతు వెబ్సైట్ రూపొందించి.. దాని ద్వారా రైతులకు వ్యవసాయ సూచనలు అందించనున్నారు.
దీంతో పాటు రాష్ట్రంలో 30 కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులకు వ్యవసాగు విధానాలు, యాజమాన్య పద్ధతులు , సాయిల్ టెస్టింగ్, నీటి పరీక్ష, వ్యవసాయ యాంత్రీకరణలో భాగం గా కస్టమ్ హైరింగ్ తదితర సేవలను అందించనున్నారు. ఇందుకు వ్యవసాయ విద్యను అభ్యసించిన గ్రాడ్యుయేట్లను, డిప్లమా పూర్తి చేసిన విద్యార్థులను ప్రతిమ అగ్రి సర్వీసెస్ సంస్థ రిక్రూట్ చేసుకొంది. ఇరు సంస్థలు పరస్పర సహకారంతో రైతులకు మెరుగైన వ్యవసాయ సలహాలు సూచనలు అందించడానికి కృషి చేస్తాయని ధీమా వ్యక్తం చేశారు. టెక్నాలజీ పరంగా మరో అడుగు ముందు కు తెలంగాణ వేసిందని తెలిపారు. సాగులో విప్లవాత్మక మార్పు మొదలైందని తెలిపారు. రాబోవు కాలంలో విద్యావంతులు సైతం సాగు పట్ల మక్కువ జూపడం పట్ల అధిక దిగుబడులు సాధించి ఇతర ప్రాంతాలకు ధాన్యం ఎగుమతి చేసే రోజులు మరెంత దూరంలో లేవన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో పాటు ప్రభుత్వం సాగుకు ప్రాధాన్యత ఇవ్వడం వల్ల సాగు అనుబంధ రంగాల్లో ఉపాధి అవకాశాలు పెరిగాయన్నారు.