గ్వాటెమాల సిటీ: ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1లో భారత్ అద్భుత ప్రదర్శన కొనసాగుతున్నది. టోక్యో ఒలింపిక్స్కు చివరి అర్హత టోర్నీ అయిన ప్రపంచకప్లో దీపికా కుమారి, అంకితా భక్త్, కోమలికా బారీతో కూడిన భారత రికర్వ్ జట్టు ఫైనల్లోకి దూసుకెళ్లింది. శనివారం జరిగిన సెమీఫైనల్లో భారత త్రయం 6-0తో స్పెయిన్ జట్టు (ఎలియా కానెల్స్, డీ వాల్సో, ఫెర్నాండెజ్)పై అలవోక విజయం సాధించింది. ఆది నుంచి తమదైన ఆధిపత్యం ప్రదర్శించిన మన ఆర్చర్లు షాంఘై (2016) తర్వాత తొలిసారి ప్రపంచకప్లో ఫైనల్ చేరి కనీసం రజత పతకం ఖాయం చేసుకున్నారు. ఆదివారం జరిగే స్వర్ణ పతక పోరులో మెక్సికో చెందిన ఏడో సీడ్ త్రయంతో భారత ఆర్చర్లు తలపడనున్నారు. మరోవైపు నూతన దంపతులు దీపిక, అతాను దాస్ మిక్స్డ్ విభాగంలో కాంస్య పతక పోరులో నిలిచారు. దీంతో పాటు వ్యక్తిగత విభాగాల్లో సెమీస్లో ప్రవేశించి మరో రెండు పతకాలను ఖాయం చేసుకున్నారు.