న్యూఢిల్లీ : కరోనా వ్యాక్సిన్పై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. అన్ని రాష్ట్రాలకు ఉచితంగానే వ్యాక్సిన్ను సరఫరా చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు విషయాన్ని కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ శనివారం ట్విట్టర్ ద్వారా తెలిపింది. కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ లేవనెత్తిన అనుమానాలను నివృత్తి చేస్తూ కేంద్రం వ్యాక్సిన్లపై స్పష్టతనిచ్చింది. కరోనా ఒక డోసును రూ.150కే తయారీ సంస్థల నుంచి కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయనుంది. ఈ మేరకు కొనుగోలు చేసిన టీకాలను రాష్ట్రాలకు సరఫరా చేయనున్నట్లు వెల్లడించింది. ఇటీవల ఓ టీకా తయారీ సంస్థ కేంద్రానికి ఒక డోసుకు రూ.150, రాష్ట్రాలకు రూ.400, ప్రైవేటు హాస్పిటల్స్కు రూ.600కు సరఫరా చేయనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.
దీంతో వ్యాక్సిన్ల ధరలపై దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. అలాగే శనివారం కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ వ్యాక్సిన్ల ధరలను తప్పుపట్టారు. వ్యాక్సిన్కు రాష్ట్ర ప్రభుత్వాలు రూ.400 చెల్లించడం అంటే అమెరికా, యూకే, ఈయూ, సౌదీ, బంగ్లాదేశ్, సౌతాఫ్రికా చెల్లించే దానికంటే ఎక్కువ అన్నారు. మేడిన్ ఇండియా టీకాకు అత్యధిక ధరనా? అని ప్రశ్నించారు. రూ.150కే విక్రయించినా కంపెనీ లాభాలు పొందుతుందన్నారు. ధరలపై మరోసారి పునరాలోచించాలని కేంద్రానికి సూచించారు. ఈ క్రమంలోనే కేంద్ర ఆరోగ్యశాఖ స్పందించింది. ప్రస్తుతం కొనసాగుతున్న మాదిరిగానే ఉచితంగా సరఫరా చేయనున్నట్లు స్పష్టతనిచ్చింది.
ఇవికూడా చదవండి..