కొవిడ్ బాధితులకు అన్నీతానైన ప్రభుత్వం
కరోనాపై అలుపెరుగని యుద్ధం
వైద్యశాలల్లో సరిపడా బెడ్లు, ఆక్సిజన్, మందులు
జిల్లాలో రోజూ వేలల్లో నిర్ధారణ టెస్టులు
ముమ్మరంగా వాక్సినేషన్ ప్రక్రియ
వరంగల్రూరల్, ఏప్రిల్ 23(నమస్తేతెలంగాణ): కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రభు త్వం టెస్టులు, వ్యాక్సినేషన్ను విస్తరించడంతో పాటు వేగవంతం చేసింది. ఆర్టీపీసీఆర్, ర్యాపిడ్ యాంటీజెన్ టెస్టు సెంటర్లు, వ్యాక్సినేషన్ కేంద్రాల సంఖ్య పెంచుతున్నది. కరోనా సోకిన వారికి హోం ఐసొలేషన్ కిట్లను అందజేస్తున్నది. ప్రభుత్వ దవాఖానల్లో ఆక్సిజన్ బెడ్లను అందుబాటులోకి తెస్తున్నది. వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, సిబ్బంది కరోనా వ్యాప్తి చెందకుండా నిర్విరామ కృషి చేస్తున్నారు. ప్రధానంగా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, సిబ్బం ది అహర్నిశలూ శ్రమిస్తున్నారు. ప్రతిరోజూ లక్ష్యానికి మిం చి టెస్టులు, వ్యాక్సినేషన్ చేస్తున్నారు. జిల్లాలోని 20 ప్రభు త్వ దవాఖానల్లో ఉచితంగా కరోనా టెస్టులు చేస్తున్నారు. నర్సంపేట ఏరియా వైద్యశాల, పరకాల, వర్ధన్నపేట సీహెచ్సీలు, రాయపర్తి (డబ్ల్యూ), పర్వతగిరి, సంగెం, గీసుగొం డ, దుగ్గొండి, కేశవాపూర్, నల్లబెల్లి, మేడపల్లి, బానోజిపేట, చెన్నారావుపేట, ఖానాపురం, అలంకానిపేట, నెక్కొండ, ఆత్మకూరు, దామెర, రాయపర్తి (పీ), శాయంపేట పీహెచ్సీల్లో టెస్టులతో పాటు వ్యాక్సిన్ వేస్తున్నారు. వీటన్నింటిలో రోజూ వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, సిబ్బంది ఉచితంగా ర్యాపిడ్ యాంటీజెన్ టెస్టులు సైతం చేస్తున్నారు.
నర్సంపేట, పరకాల, వర్ధన్నపేట సీహెచ్సీల్లో ఆర్టీపీసీఆర్ టెస్టులు కూడా నిర్వహిస్తున్నారు. కొద్ది రోజుల నుంచి ఏడు వాహనాల ద్వారా జిల్లాలో మొబైల్ టెస్టులు సైతం చేస్తున్నారు. ఏదైనా గ్రామంలో కరోనా లక్షణాలతో బాధపడుతున్నట్లు, పాజిటీవ్ నిర్ధారణ అయినట్లు సమాచారం అందిన వెంటనే సదరు గ్రామాలకు మొబైల్ వాహనాలు వెళ్లి టెస్టులు చేస్తున్నాయి. జిల్లాలో రోజూ 1,400 ఆర్టీపీసీఆర్, ర్యాపిడ్ యాంటీజెన్ టెస్టులు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఒక్కో రోజు లక్ష్యానికి మించి 2వేల నుంచి 2,200 టెస్టులు చేస్తున్నారు. ఇప్పటివరకు 20 దవాఖానల్లో 1,60,164 మందికి టెస్టులు చేశారు. 9,357 మందికి పాజిటివ్గా నిర్ధారణైంది. కరోనా టెస్టులు, వైద్య సేవలపై సమాచారం ఇచ్చేందుకు, వ్యాక్సినేషన్పై సూచనలు చేసేందుకు కలెక్టరేట్లో కాల్ సెంటర్ (18004253424) ఏర్పాటు చేశారు. కరోనా టెస్టుల సెంటర్లు, హోం ఐసొలేషన్ కిట్ల అందజేత, వ్యాక్సినేషన్ సెంటర్లు, ఆక్సిజన్ బెడ్స్ అందుబాటులో ఉన్న దవాఖానల వివరాలను ఈ కాల్ సెంటర్ ద్వారా బాధితులకు తెలియజేస్తున్నారు. అత్యవసరమైతే 108కు సమాచారం ఇవ్వాలని సూచిస్తున్నారు.
అందుబాటులో ఆక్సిజన్ బెడ్స్
అత్యవసరం ఉన్నవారికి ఆక్సిజన్ బెడ్స్ అందుబాటులో ఉండేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం నర్సంపేట వైద్యశాలలో 30 ఆక్సిజన్ బెడ్స్ రెడీగా ఉన్నట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి చల్లా మధుసూదన్ వెల్లడించారు. కలెక్టర్ ఆదేశాలతో పరకాల, వర్ధన్నపేట సీహెచ్సీల్లో 10చొప్పున బెడ్స్ను ఏర్పాటు చేసే పనులు చేపట్టారు. జిల్లాలోని మూడు దవాఖానల్లో మొత్తం 50 ఆక్సిజన్ బెడ్స్ అందుబాటులో ఉన్నాయి. కరోనా ట్రీట్మెంట్ కోసం జిల్లాలో 25 ప్రైవేట్ వైద్యశాలలకు ప్రభుత్వం అనుమతిచ్చింది. వీటిలో ప్రస్తుతం నర్సంపేటలోని పవన్ నర్సింగ్హోం, పరకాలలోని లలిత నర్సింగ్హోంలో కరోనా బాధితులకు వైద్యం అందుతున్నది. పరిస్థితి విషమిస్తే అందుబాటులో ఉండేలా మూడు కొవిడ్ కేర్ సెంటర్లను కూడా జిల్లాలో ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కలెక్టర్ ఆదేశాలతో నర్సంపేట, పరకాల, వర్ధన్నపేటలో వందేసి బెడ్లతో వీటిని ఏర్పాటు చేస్తున్నారు. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు జిల్లావ్యాప్తంగా 417 ర్యాపిడ్ రెస్పాన్స్ టీంలు పనిచేస్తున్నాయి. గ్రామ, మండల, డివిజన్, జిల్లా స్థాయిలో విధులు నిర్వహిస్తున్న ఈ బృందాల్లో వైద్య ఆరోగ్యశాఖ, పంచాయతీ, రెవెన్యూ తదితర శాఖల ఉద్యోగులు సభ్యులుగా ఉన్నారు. మండల టీం ఇన్చార్జిగా స్థానిక మెడికల్ అధికారి, డివిజన్ టీం ఇన్చార్జిగా డిప్యూటీ డీఎంహెచ్వో, జిల్లా టీం ఇన్చార్జిగా డీఎంహెచ్వో బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. జిల్లాలో కరోనా టెస్టుల నిర్వహణ, బాధితులకు హోంఐసొలేషన్ కిట్ల అందజేతలో వైద్య అధికారి విపిన్ సమన్వయ అధికారిగా వ్యవహరిస్తున్నారు.
వ్యాక్సినేషన్ ముమ్మరం
కరోనా వ్యాక్సిన్ వేసుకునేందుకు ప్రజలు స్వస్ఛందంగా ముందుకొస్తున్నారు. దీంతో రోజురోజుకూ జిల్లాలో వ్యాక్సినేషన్ ముమ్మరంగా సాగుతున్నది. జిల్లాలోని మూడు సీహెచ్సీలు, 17 పీహెచ్సీలు, పరకాలలోని ఓ ప్రైవేట్ దవాఖాన (కోల్ చైన్ పాయింట్)లో వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతున్నది. మూడు కోల్ చైన్ రూట్ల ద్వారా ఈ 21 సెంటర్లకు వ్యాక్సిన్ సరఫరా అవుతున్నది. 21 కేంద్రాల్లో రోజూ 2,500 మందికి వ్యాక్సిన్ వేయాలని లక్ష్యం కాగా జిల్లాలో ఈ సంఖ్య 3 వేలు దాటుతున్నది. గురువారం జిల్లాలోని 21 సెంటర్లలో 2,847 మంది వ్యాక్సిన్ వేసుకున్నారు. శుక్రవారం ఈ సంఖ్య మూడు వేలు దాటింది. గు రువారం వరకు జిల్లాలో 32,507 మందికి కరోనా వ్యా క్సిన్ వేసినట్లు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు పేర్కొన్నారు. శుక్రవారం టీకా వేసుకున్న వారితో కలిపి జిల్లాలో వ్యాక్సిన్ వేసుకున్న వారి సంఖ్య 35 వేలు దాటినట్లు తెలిపారు.
అహర్నిశలూ వైద్య సేవలు
కరోనా మహమ్మారిని ఎదుర్కునేందుకు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, సిబ్బంది ప్రశంసనీయ సేవలందిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా ఈ శాఖలో 2,500 మందికిపైగా పనిచేస్తున్నారు. వీరిలో డీఎంహెచ్వో నుంచి మొదలు డిప్యూటీ డీఎంహెచ్వోలు, మెడికల్ ఆఫీసర్లు, సూపర్వైజర్లు, ప్రోగ్రామ్ ఆఫీసర్లు, స్టాప్నర్సులు, ఫస్ట్ ఏఎన్ఎంలు, సెకండ్ ఏఎన్ఎంలు, ఫార్మసిస్టులు ఉన్నారు. ఆశ వర్కర్లు, ఇతరులు కలిపి సుమారు 3,500 మందికిపైగా కరోనా పోరులో ముందు నిలుస్తున్నారు. కరోనా టెస్టులు, నమూనాల సేకరణ, హోం ఐసొలేషన్ కిట్ల పంపిణీతో పాటు కోల్ చైన్ మేనేజ్మెంటులో భాగంగా వ్యాక్సిన్ ట్రాన్స్పోర్టు, నిల్వలు, టీకా పంపిణీ, లబ్ధిదారులకు మందులు ఇవ్వడం, వారి వివరాలను ఎంట్రీ చేయడం వంటివి చేస్తున్నారు. ప్రతి వ్యాక్సిన్ సెంటర్లో రిజిస్ట్రేషన్, డాటా ఎంట్రీ, వ్యాక్సినేషన్, అబ్జర్వేషన్ కోసం ఐదుగురు విధులు నిర్వర్తిస్తున్నారు. డీఎంహెచ్వో మధుసూదన్ పర్యవేక్షణలో వైద్య ఆరోగ్యశాఖ అధికారి విపిన్ కరోనా టెస్టుల నిర్వహణ, ప్రకాశ్ వ్యాక్సినేషన్ కార్యక్రమం అమల్లో జిల్లాలోని అధికారులు, సిబ్బందిని సమన్వయ పరుస్తున్నారు. కలెక్టర్ ఎం హరిత జిల్లాలో కరోనా నియంత్రణపై ఎప్పటికప్పుడు అన్ని శాఖల అధికారులతో సమీక్షలు నిర్వహిస్తూ దిశా నిర్దేశం చేస్తున్నారు.
ప్రతి ఒకరూ వ్యాక్సిన్ వేసుకోవాలి
చల్లా మధుసూదన్, డీఎంహెచ్వో
కరోనా నియంత్రణకు మాస్కు ధరించడం తప్పనిసరి. మా స్కు లేకుండా బయటకు వెళ్లొద్దు. అత్యవసరమైతేనే ఇంటి నుంచి బయటకు రావాలి. ఇంట్లోకి అడుగుపెట్టే ముందు శానిటైజర్తో చేతులు శుభ్రం చేసుకోవాలి. సాధ్యమైనంత వరకు భౌతిక దూరం పాటించాలి. నీరు బాగా తాగాలి. ఆయిల్ ఫుడ్ ఎక్కువ తీసుకోవద్దు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే, ఆక్సిజన్ లెవల్స్ 95 కంటే తక్కువ ఉంటే డాక్టర్ను సంప్రదించాలి. జ్వరం, దగ్గు వంటివి వస్తే ఆందోళన చెందవద్దు. ఆక్సిజన్ అవసరమైతే అందుబాటులో ఉన్న దవాఖానకు వెళ్లాలి. 45 ఏండు ్లపైబడిన ప్రతి ఒకరూ కరోనా వ్యాక్సిన్ వేసుకోవాలి.
ఇవి కూడా చదవండి
కోవిడ్ హాస్పిటల్లో కేంద్రమంత్రి.. అధికారులతో మంతనాలు
బీజేపీ మోసపూరిత రాజకీయాలను తిప్పికొట్టండి