ఆర్మూర్, ఏప్రిల్ 23 : వివిధ ఇన్సూరెన్సు కంపెనీలకు సంబంధించి నకిలీ బాండ్లను తయారుచేసి అమాయక ప్రజలను మోసం చేస్తున్న ఆర్టీవో ఏజెంట్లపై, లక్కోర వద్ద పొల్యూషన్ చెక్పాయింట్పై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఏఐటీయూసీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు వారు శుక్రవారం ఆర్మూర్ మోటారు వెహికిల్ ఇన్స్పెక్టర్ వెంకటయ్యకు వినతపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆర్మూర్ డివిజన్ కార్యదర్శి ఆరేపల్లి సాయిలు మాట్లాడుతూ .. పట్టణంలోని కొందరు ఆర్టీవో ఏజెంట్లతోపాటు లక్కోర పొల్యూషన్ పాయింట్ వద్ద వాహనదారుల నుంచి డబ్బులు వసూలు చేసి వివిధ బీమా కంపెనీలకు చెందిన నకిలీ బాండ్లు అంటగడుతున్నారని ఆరోపించారు. దీంతో ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు వాహన యజమానికి, ప్రమాద బాధితులకు డబ్బులు రాకుండా నష్టం వాటిల్లుతుందన్నారు. అక్రమాలకు పాల్పడుతున్న వారిపై సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని, ఇప్పటివరకు వసూలు చేసిన డబ్బులను రికవరీ చేయాలని కోరారు. వినతిపత్రం అందజేసిన వారిలో వేముల సదానంద్, వినోద్ వర్మ, కుమార్, జ్యోతికుమార్ తదితరులున్నారు.