న్యూఢిల్లీ, ఏప్రిల్ 22: డబుల్ మాస్కులతో కరోనా వైరస్ నుంచి డబుల్ రక్షణ లభిస్తుందని అమెరికాలోని నార్త్ కరోలినా శాస్త్రవేత్తల అధ్యయనంలో తేలింది. శాస్త్రవేత్తలు తమ అధ్యయనంలో భాగంగా ఒక గదిలో వివిధ రకాల మాస్కులు ఉప్పు నీటి అణువులను(ఏరోసోల్స్) ఎలా అడ్డుకొంటాయన్నదానిపై ప్రయోగాలు చేశారు. డబుల్ మాస్కుతో ఎక్కువ ప్రయోజనం ఉంటుందని తేలింది. సర్జికల్ మాస్కుతో పాటు క్లాత్ మాస్కు వాడితే వైరస్ను అడ్డుకొనే శక్తి సర్జికల్ మాస్కుతో పోల్చితే శాతం పెరుగుతుందని శాస్త్రవేత్తలు చెప్పారు. వైరస్లను అడ్డుకోవడం క్లాత్ మాస్కులు తక్కువ ప్రభావవంతంగా ఉంటాయని, వాటి దారపు పోగుల మధ్య ఖాళీ స్థలం ఎక్కువగా ఉండటమే అందుకు కారణమన్నారు. ఈ అధ్యయనంపై ఎయిమ్స్ డైరెక్టర్ రణ్దీప్ గులేరియా మాట్లాడారు. సాధారణంగా ఎన్-95 మాస్కులు తగిన రక్షణ కల్పిస్తాయని చెప్పారు. అయితే అవి అంత సులభంగా మార్కెట్లో లభించడం లేదని వాటి తర్వాత బెస్ట్ ఆప్షన్ డబుల్ మాస్క్ అని చెప్పారు. ఎన్ 95 మాస్కులు 90% ప్రభావవంతంగా వైరస్ను అడ్డుకొంటాయని సర్జికల్ మాస్కులు 85-90% అడ్డుకొంటాయని చెప్పారు. అన్నింటికంటే ముఖ్యంగా ఏ మాస్కు వాడినా సరైన పద్ధతిలో వాడాలన్నారు.
శుభ్రమైన చేతులతోనే మాస్కును తాకాలి. మాస్కును తాకే ముందు చేతులు కడుక్కోవాలి.
నోరు, ముక్కును కప్పి ఉంచేలా మాస్కు ధరించాలి. నోరు, ముక్కును కప్పి ఉంచినా కూడా మాస్కు బిగుతుగా ఉండాలి. పక్కల నుంచి గాలి లోపలికి పోవద్దు. క్లాత్ మాస్కు అయితే వాడిన ప్రతీసారి ఉతకాలి.