న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో కొవిడ్-19 కేసులు పెరుగుతుండటంతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు, అధికారులు కోరుతున్నా పలువురు నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తున్నారు. కరోనా నిబంధనలు పాటించకుండా వారి ప్రాణాలతో పాటు కుటుంబ సభ్యుల ప్రాణాలనూ రిస్క్ లో పడేస్తున్నారు. ఢిల్లీలోని జీటీబీ ఆస్పత్రిలో ఇటీవల ఓ మహిళను కొవిడ్ వార్డు నుంచి వెళ్లాలని కోరినందుకు డ్యూటీలో ఉన్న డాక్టర్ ను కొట్టడం కలకలం రేపింది.
మహిళ భర్త కరోనా వైరస్ తో బాధపడుతూ ఆస్పత్రిలోని కొవిడ్ వార్డులో చేరాడు. ఘటన జరిగిన రోజు మహిళ కొవిడ్ వార్డులో ఉండగా అక్కడి నుంచి వెళ్లాలని డ్యూటీలో ఉన్న డాక్టర్ అహ్మిత కోరగా ఆమె వాగ్వాదానికి దిగింది. ఇరువురి మధ్య మాటామాటా పెరగడంతో మహిళ కోపంతో డాక్టర్ చెంప చెళ్లుమనిపించింది. ఆస్పత్రి వర్గాల ఫిర్యాదుతో కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.
మరోవైపు దేశ రాజధానిలో కరోనా కేసులు పెరగడంతో నేటి రాత్రి నుంచి ఆరు రోజుల పాటు ఢిల్లీలో లాక్డౌన్ విధించారు.