ఎండాకాలంలో ఈత సరదా చిన్నారులకు ప్రాణహాని కలిగిస్తున్నది. అప్పటివరకు ఆడతూపాడుతూ కుటుంబ సభ్యుల మధ్య గడిపిన చిన్నారులు, ఒక్కసారిగా నీటిలో పడి మృతి చెందారంటూ సమాచారం రాగానే ఆ కుటుంబాలు దిక్కుతోచని స్థితిలో చిన్నాభిన్నమవుతున్నాయి. నదులు, కాల్వలు, బావులు, వంకల్లో వేసవి తాపాన్ని తీర్చుకునేలా తల్లిదండ్రులకు తెలియకుండానే చిన్నారులు ఈతకు వెళ్లి ప్రాణాలు కోల్పోతున్నారు. ఇలాంటి సంఘటనలు ప్రతి ఏటా షరామాములయ్యాయి. నివారణ చర్యలు చేపట్టాల్సిన అధికారులు సంఘటనలు జరిగిన అనంతరం హడావుడి చేపట్టి అనంతరం మౌనం దాల్చుతుండడంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రతి ఏడాది 10 నుంచి 25 మంది నీట మునిగి మృత్యువాత పడుతున్నారు. అధికారులు తల్లిదండ్రులను అప్రమత్తం చేసి నీటి వనరుల వద్దకు చిన్నారులు వెళ్లకుండా చూడాల్సిన అవసరం అధికారులపై ఎంతైనా ఉంది. సంబ ధిత అధికారులు కాల్వల వెంట ప్రమాదకర ప్రాంతాలను గుర్తించి హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలి. గ్రామాల్లో చిన్నారుల తల్లిదండ్రులకు అవగాహన కల్పించి ప్రమాదాలు జరుగకుండా చర్యలు చేపట్టాల్సి ఉంది.