ఎంజీఎం దవాఖానలో వెలుగు చూస్తున్న అధికారుల బాగోతం
టెండర్ విషయం తేల్చకుండా నెలల తరబడి నాన్చుతున్న వైనం
ప్రారంభించకుండానే గ్యాస్ ప్లాంట్ వినియోగం
ఆక్సిజన్ వినియోగం తగ్గినా పెరుగుతున్న దిగుమతి
వరంగల్ చౌరస్తా, ఏప్రిల్ 18: ఉత్తర తెలంగాణ వ్యాప్తంగా పేదల సంజీవనిగా వైద్యసేవలు అందిస్తున్న వరంగల్ ఎంజీఎం దవాఖానలో పలువురు అధికారులు అత్యవసరం పేరుతో అక్రమ దందా కొనసాగిస్తున్నారు. కరోనాను సాకుగా చూపి వారు చేస్తున్న అక్రమాలు అన్నీ ఇన్నీ కావు. గతంలో మందుల పంపిణీ గుత్తేదారు కాలపరిమితి పూర్తయి సుమారు ఏడాది గడుస్తున్నా, టెండర్ ప్రక్రియను పూర్తి చేయడానికి అధికారులు చొరవ చూపడం లేదు. రెండు నెలలుగా మందుల పంపిణీదారులకు టెండర్ ప్రక్రియను పూర్తి చేసి, తద్వారా కొనుగోళ్లు చేపట్టాల్సిన అధికారులు అదేది పట్టించుకోకుండా అత్యవసరం పేరుతో అక్రమాలకు పాల్పడుతున్నారు. అవసరాలకు కావాల్సిన మందులను అధిక ధరలకు, ఎక్కువ మొత్తంలో కొనుగోళ్లు చేస్తున్నట్లు పలువురు సిబ్బంది చర్చించుకుంటున్నారు. ఇదిలా ఉండగా, సుమారు 13 టన్నుల సామర్థ్యం, 5.5 లక్షల వ్యయంలో అక్టోబర్లో నిర్మించిన గ్యాస్ ప్లాంట్ను త్వరలో మంత్రి చేతుల మీదుగా ప్రారంభిస్తామని చెప్పిన అధికారులు నేరుగా వినియోగిస్తున్నారు.
ఉన్నతాధికారుల ఆదేశాలు, మంత్రి చేతుల మీదుగా ప్రారంభోత్సవాలు చేపట్టకుండానే వినియోగించడంపై కొందరు ఉద్యోగులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దవాఖాన పరిపాలనా విభాగం బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఉన్నతాధికారికి చెందిన ప్రైవేట్ దవాఖానలో సైతం ఎంజీఎంకు మంజూరు చేసిన ఆక్సిజన్ వినియోగిస్తున్నట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అత్యవసరం, ముందు జాగ్రత్త చర్యల పేరుతో అధిక మొత్తంలో ఆక్సిజన్ నిల్వలు చూపుతూ అడ్డదారిలో ప్రైవేట్ దవాఖానలకు మళ్లిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం దవాఖానలో అందించే వైద్యసేవల వివరాల్లో పెద్దగా మార్పులు కనిపించనప్పటికీ ఆక్సిజన్ వినియోగంలో మాత్రం భారీగా పెరుగుదల కనిపిస్తున్నది.
ఇక మందుల విషయానికి వస్తే కరోనా బారిన పడిన వారిలో రక్త ప్రసరణ మందగించి రక్తం గడ్డకట్టకుండా ఉండడానికి వినియోగించే రూ. లక్షల ఖరీదైన లోమ్యానిక్యూలర్ హెపారిన్ మందులు సైతం అడ్డదారిలో ప్రైవేట్ దవాఖానలకు తరలిస్తున్నారని సిబ్బంది పేర్కొంటున్నారు. దీనికి తోడు గతంలో కరోనాను ఎదుర్కోవడానికి దాతలు అందించిన వెంటిలేటర్లలో సుమారు 10 వెంటిలేటర్లు ఓ ఉన్నతాధికారి తన సొంత దవాఖానకు తరలించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అలాగే దాతలు అందించిన వెంటిలేటర్ల వివరాలు తెలుపాలని కోరినప్పటికీ అధికారులు స్పందించకపోవడం మరింత అనుమానాలకు దారి తీస్తున్నది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఎంజీఎం దవాఖానపై దృష్టి సారించి ప్రభుత్వ ఆరోగ్య తెలంగాణ లక్ష్యం నెరవేర్చేందుకు చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.