హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 18(నమస్తే తెలంగాణ):కరోనా సెకెండ్వేవ్ ఉధృతి కొనసాగుతుండటంతో ఇంటినుంచి అడుగు బయటపెట్టాలంటేనే ప్రజలు జంకుతున్నారు. రోజురోజుకు పెరుగుతున్న పాజిటివ్ కేసుల సంఖ్య ఆందోళన కలిగిస్తున్నది. ఈ పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్క్ ధరించాలని వైద్యులు, నిపుణులు సూచిస్తున్నారు. కరోనా దరిచేరకుండా కాపాడే ఆయుధం మాస్క్ ఒక్కటేనని చెప్తున్నారు. చాలామందికి మాస్క్లు ఎలా వాడాలన్నదానిపై సరైన అవగాహన లేదు. మాస్క్లను సరైన విధానంలో వాడకపోతే ఉపయోగం ఉండదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు మాస్క్లకు డిమాండ్ ఒక్కసారిగా పెరుగటంతో చాలామంది వ్యాపారులు మాస్క్ల తయారీ, విక్రయాలపై దృష్టి సారించారు. హైదరాబాద్లోని బేగంబజార్, చార్మినార్, మోండా మార్కెట్ తదితర ప్రాంతాల్లో విభిన్న రకాల మాస్క్లు అందుబాటులో ఉన్నాయి. రూ.5 నుంచి వందల ధరల్లో మాస్క్ లభిస్తున్నాయి. కరోనా కాలంలో కొందరికి ఇదే ప్రధాన వ్యాపారంగా మారిందని బేగంబజార్ వ్యాపారి జాఫర్ తెలిపారు.
మాస్క్ ఇలా ధరించొద్దు..
మాస్క్లు ధరించడంపై చాలా మందికి అవగాహన లేదు. ముక్కు, నోరు, గడ్డం భాగాలన్నీ కప్పిఉంచేలా మాస్క్లను ధరించడంలేదు. కేవలం ముక్కు, నోరు కప్పి ఉంచుకుంటే చాలనుకుంటున్నారు. అది ప్రమాదకరమని వైద్యులు చెబుతున్నారు.
ముక్కు కింది భాగంలో మాస్క్ ధరించకూడదు. మాస్క్ వదులుగా ధరిస్తే ఉపయోగం ఉండదు.
పని ప్రదేశాల్లో, బయటి ప్రాంతాల్లో ఎట్టిపరిస్థితుల్లో మాస్క్ను కిందికి జరిపి రిలాక్స్ అవడం మంచిదికాదు.
ఇలా చేద్దాం:
మాస్క్ ధరించే ముందు, తర్వాత చేతులను పరిశుభ్రం చేసుకోవాలి.
స్టిఫ్ మాస్క్లనే ధరించాలి. సాధారణ మాస్క్ గాలికి, కదలికల కారణంగా కిందికి జారుతుంది. మాస్క్లు ముట్టుకోవటం ప్రమాదం.
మాస్క్లు తొలగించిన సందర్భంలో మాస్క్ ముందు భాగాన్ని ముట్టుకోకూడదు.
రోజూ మాస్క్లను ఉతుక్కొని పరిశుభ్రం చేసుకోవాలి. తడిగా, తేమగా ఉన్న మాస్క్లను ధరించకూడదు.
ఏ మాస్క్ మంచిది?
చాలామంది మార్కెట్లో ఏ మాస్క్ లభిస్తే అది పెట్టుకుని తిరుగుతున్నారు. ఏ రకం మాస్క్లు సురక్షితం అన్నది అవగాహన లేదు. ఏ రకం మాస్క్లు వైరస్, బ్యాక్టీరియా, దుమ్మును ఎంత శాతం అడ్డుకోగలుగుతాయనే వివరాలను వెర్సోయి హెల్త్కేర్ ప్రాడక్ట్ సంస్థ వెల్లడించింది.