ప్రారంభమైన కొనుగోలు కేంద్రాలు
సంతోషం వ్యక్తం చేస్తున్న రైతులు
హుజూరాబాద్, ఏప్రిల్ 16: ఆరుగాలం కష్టపడి రైతన్న పండించిన పంట చేతికి వస్తున్నది. ప్రభుత్వం గ్రామగ్రామాన కొనుగోళ్లు చేపడుతుండడంతో వరి కోతలు ముమ్మరంగా సాగుతున్నాయి. వానకాలంలో మొత్తం 2,60,387 క్వింటాళ్ల ధాన్యాన్ని ప్రభుత్వం సేకరించగా, ప్రస్తుత సీజన్లో కొంచెం అటుఇటుగా అదేస్థాయిలో కొనుగోలుకు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. యాసంగిలో మండలంలో 23,857 ఎకరాల్లో వరి పంట సాగైంది.
ఎటుచూసినా ధాన్యపు రాశులే
వరి కోతలు ముమ్మరం కావడంతో డివిజన్లో ఎటూచూసినా ధాన్యపు రాశులే కనబడుతున్నాయి. ఇటీవల అకాల వర్షంతో కోతలకు కొంత ఆటంకం కలుగగా తిరిగి వేగవంతమయ్యాయి. అన్ని మండలాల్లో వరి కోతలు ఊపందుకోగా, ఇప్పటి వరకు 30శాతం వరకు పూర్తయినట్లు వ్యవసాయాధికారులు పేర్కొన్నారు. ప్రభుత్వం అందుబాటులో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తుండడంతో అన్నదాతలు సంతోషంగా ఉన్నారు.
కొనుగోలు కేంద్రాలు ఇవే..
రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ప్రభుత్వం గతంలో మాదిరిగానే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. హుజూరాబాద్, జూపాక, తుమ్మనపల్లి పీఏసీఎస్ల ఆధ్వర్యంలో 13 కేంద్రాలు ఏర్పాటు చేయగా, హుజూరాబాద్ పీఏసీఎస్ ఆధ్వర్యంలో హుజూరాబాద్, రంగాపూర్, రాంపూర్, సిర్సపల్లి, పెద్దపాపయ్యపల్లి, వెంకట్రావుపల్లి గ్రామాల్లో ధాన్యం సేకరించనున్నారు. జూపాక పీఏసీఎస్ ఆధ్వర్యంలో బొత్తలపల్లి, కనుకులగిద్దలలో, శాలపల్లి గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. తుమ్మనపల్లి పీఏసీఎస్ ఆధ్వర్యంలో తుమ్మనపల్లి, సింగాపూర్, బోర్నపల్లి, మాందాడిపల్లిలో ధాన్యం కొనుగోలు చేయనున్నారు. డీసీఎంఎస్ ఆధ్వర్యంలో ఇప్పలనర్సింగాపూర్, ధర్మరాజుపల్లి, దమ్మక్కపేట, కందుగుల, చిన్నపాపయ్యపల్లి, ఇందిరానగర్, జూపాక, కాట్రపల్లిలో కొనుగోలు కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. ఐకేపీ ఆధ్వర్యంలో చెల్పూర్, పోతిరెడ్డిపేటలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభమయ్యాయి. హుజూరాబాద్ వ్యవసాయ మార్కెట్ ఆధ్వర్యంలో హుజూరాబాద్లో కూడా ఓ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.
రైతులకు దళారుల బెడద తప్పింది
ధాన్యం విక్రయంలో రైతులకు దళారుల బెడద తప్పింది. ప్రభుత్వం కొనుగోలు చేయకుంటే వ్యాపారులు, మిల్లర్లు అగ్గువసగ్గువకు అడిగేటోళ్లు. ధాన్యం విక్రయించిన వారం పది రోజుల్లో డబ్బులు రైతుల ఖాతాల్లో జమవుతాయి. గన్నీ సంచుల కొరత లేకుండా అధికారులు ముందుగానే జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
ఎడవెల్లి కొండల్రెడ్డి, హుజూరాబాద్ సింగిల్ విండో చైర్మన్
ఇవి కూడా చదవండి
నాగార్జునసాగర్ ఉపఎన్నిక పోలింగ్కు సర్వం సిద్ధం
అత్తింటి వేధింపులు తట్టుకోలేక వ్యక్తి ఆత్మహత్య