వర్గల్, ఏప్రిల్ 11: తాగడానికే నీళ్లు ఇవ్వనివాళ్లు, కరెంట్ కష్టాలు తీర్చని వాళ్లు, రైతు ఆత్మహత్యలు జరుగుతున్నా ఏమి చేయనోళ్లు ఇవాళ మండుటెండల్లో పారుతున్న గోదావరి నీళ్లను చూసి బిత్తరపోతున్నారని ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. ఆదివారం సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం నాచారంగుట్ట హల్దీవాగు వద్ద గోదావరి జలాలకు చీరె,సారె సమర్పించి కుంభహారతి, నక్షత్ర హారతులు ఇచ్చారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. ప్రతిపక్ష కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ తీరుపై తీవ్ర విమర్శలు చేశారు.
సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతం తాగు, సాగునీరు లేక ఎడారిగా మారినా పట్టించుకోనోళ్లు, ఇప్పుడు నోటికి వచ్చినట్టుగా మాట్లాడటం సరికాదన్నారు. మండుటెండల్లో వాగులు, చెరువులు, కుంటలు పారించిన ఘనత దేశంలో ఒక్క టీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. కాంగ్రెస్తో సహా ఇతర ప్రతిపక్ష నాయకులు సినిమా డైలాగులు చెప్పడానికే సరిపోతున్నారని ఎద్దేవా చేశారు. గత కాంగ్రెస్, టీడీపీ కాలంలో కరెంట్ కష్టాలు, రైతుల ఆత్మహత్యలు తప్పా, వారు చేసిన అభివృద్ధి శూన్యమన్నారు. వలసలు, కాలిపోయే మోటర్లు, ఏ ఊరు చూసినా గుంతల రోడ్లు కన్పించాయని మంత్రి హరీశ్రావు దుయ్యబట్టారు. రెండు వందల రూపాయల పింఛన్ ఇచ్చి చేతులు దులుపుకొన్నారే తప్పా ఏమి చేయలేదని విమర్శించారు. దేశంలోనే వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ రంగాలకు పెద్ద ఎత్తున బడ్జెట్ కేటాయించిన ప్రభుత్వం తమదేనన్నారు.
దేశంలోనే వలసలు, ఆత్మహత్యలు ఎక్కువగా ఉన్న పాలమూరు జిల్లావాసులకు ఇప్పుడు గోదావరి జలాలను తీసుకెళ్లి కరువును పారదోలామని తెలిపారు. ఇంతకుముందు నాచారం గుట్టకు వచ్చే భక్తులు తలపై నీళ్లు చల్లుకునేందుకు వాటర్ బాటిళ్లు వెంట తెచ్చుకునేవాళ్లని, ఇప్పుడు ఆ పరిస్థితి మారి పవిత్ర గోదావరి నీళ్లతో మండుటెండల్లో పుణ్య స్నానాలు చేసి దేవుడిని దర్శించుకునేలా చేశామన్నారు. అంతకుముందు నాచగిరి శ్రీలక్ష్మీనృసింహస్వామి రథోత్సవంలో పాల్గొన్న మంత్రి ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్రెడ్డి, ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభాశ్రెడ్డి, నాచారం ట్రస్టు బోర్డు చైర్మన్ హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు.