ప్రత్యేక ప్రతినిధి, ఏప్రిల్ 11 (నమస్తే తెలంగాణ): కరోనా కేసుల తీవ్రత పెరుగుతున్న క్రమంలో వ్యాధి వ్యాప్తిని అరికట్టడానికి తెలంగాణ ప్రభుత్వం అత్యంత కఠినంగా వ్యవహరిస్తున్నది. ఒకవైపు వైరస్ కట్టడికి అన్ని జాగ్రత్తలూ తీసుకొంటూనే.. మరోవైపు బాధ్యతను విస్మరించేవారిపై చట్టపరమైన చర్యలకూ ఆదేశాలు జారీచేసింది. బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ ధరించని వారిపై వెయ్యి రూపాయలు జరిమానా విధించాలని నిర్ణయించింది. నిర్లక్ష్యం మితిమీరితే ప్రాసిక్యూషన్ తప్పదని హెచ్చరించింది. ఇందుకు సంబంధించి ఆదివారం ప్రత్యేకంగా ఉత్తర్వులు జారీచేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్కుమార్ పోలీసు ఉన్నతాధికారులను, జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. మాస్కులు ధరించాలని పదే పదే విజ్ఞప్తిచేస్తున్నా.. చాలామంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంపై ప్రభుత్వం సీరియస్గా స్పందించింది. మాస్క్ ధరించని వారిపై ముందుగా వెయ్యి రూపాయల జరిమానా విధించాలని.. అప్పటికీ వినకపోతే.. అంటువ్యాధుల నియంత్రణ చట్టంకింద కేసులు నమోదు చేస్తామని ఉత్తర్వుల్లో హెచ్చరించింది. డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005లోని 51నుంచి 60 సెక్షన్ల వరకు, ఐపీసీ 188 సెక్షన్ ప్రకారం ప్రాసిక్యూషన్ తప్పదని స్పష్టంచేసింది.
ప్రభుత్వ మార్గదర్శకాలను పాటించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వారిపై పోలీసులు పెద్ద ఎత్తున కేసులు నమోదుచేస్తున్నారు. మాస్క్ ధరించనివారిపై ఈ నెల 5 నుంచి 11 వరకు 6,478 కేసులను నమోదు చేసినట్లు అధికారులు వెల్లడించారు. హైదరాబాద్లో అత్యధికంగా 2,030, రామగుండంలో 938, రాచకొండలో 670, సైబరాబాద్లో 514 కేసులు నమోదయ్యాయి. ‘మీరు సీసీ టీవీ నిఘాలో ఉన్నారు. దయచేసి మాస్క్ ధరించండి. మాస్క్ ధరించకపోతే వెయ్యి రూపాయల జరిమానా విధిస్తాం’ అని హెచ్చరిస్తూ పోలీసులు ప్రచారం చేస్తున్నారు.