సీఈవో విజయనాయక్
మల్దకల్ ఏప్రిల్ 10: కరోనా కట్టడి కోసం ప్రతి ఒక్కరూ మాస్కు ధరించాలని, తరచూ శానిటైజర్తో చేతులు శుభ్రం చేసుకోవాలని సీఈవో విజయనాయక్ ప్రజలకు సూచించా రు. మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయాన్ని శనివారం ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. ఆనంతరం మండల కేంద్రంలోని పీహెచ్సీ కేంద్రం లో కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియను ఆమె పరిశీలించారు. పీహెచ్సీలో గుంపులు గుంపులుగా ఉన్న ప్రజలతో మాట్లా డుతూ ఇలా ఉంటే కరోనా ప్రభావం ఉంటుందని, ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి సామాజిక దూరం పాటించి వ్యాక్సిన్ తీసుకోవాలని సూచించారు. ఎండలో ఉన్నవారిని చూసి తాగునీటి సమ స్య ఉందా అని ప్రశ్నించారు. సెంటర్లో వ్యాక్సిన్ వేసుకున్న వారితో ప్రత్యేకంగా మాట్లాడారు. 45 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకోవాలని సూచించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని మండల వైద్యాధికారిణి డాక్టర్ యమునకు సూచించారు.
మండలంలోని బిజ్వారం, అమరవాయి, ఎల్కూర్, తాటికుంట తదితర గ్రామాల్లోని హెల్త్ సబ్ సెంటర్లలో వ్యాక్సిన్లు వేయాలని వివిధ గ్రామాలకు చెందిన ప్రజలు సీఈవో విజయనాయక్ను కోరారు. మండల కేంద్రంలోని పీహెచ్సీలో మాత్రమే వ్యాక్సిన్లు వేస్తున్నారని దీంతో అన్ని గ్రామాలకు చెందినవారు వస్తున్నారని, వ్యాక్సిన్ వేయించుకోవడానికి చాలా సమయం పడుతుందన్నారు. సబ్ సెంటర్లలో కూడా వ్యాక్సిన్ వేస్తే ఆయా సెంటర్ల పరిధిలోని గ్రామాలకు చెందిన ప్రజలు అక్కడికే వెళ్తారని దీంతో ఇబ్బందులు ఉండవని విజ్ఞప్తి చేశారు. ఎండ తీవ్రత నేపథ్యంలో మండల కేంద్రానికి రావడానికి అవస్థలు పడుతున్నామన్నారు. విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని సీఈవో హామీ ఇచ్చారు. సీఈవో వెంట ఎంపీడీవో కృష్ణయ్య, ఎంపీవో ప్రవీణ్కుమార్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.