ఊర్లలోనే కొనుగోలు కేంద్రాల ఏర్పాటు
ఐకేపీ, డీసీఎంఎస్, పీఏసీఎస్ ద్వారా ధాన్యం సేకరణ
గతేడాది రూ.19.84 కోట్ల కమీషన్ చెల్లింపు
అన్నదాతలకు అండగా నిలుస్తున్న తెలంగాణ సర్కారు
ఆదిలాబాద్, ఏప్రిల్ 8(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : రైతులు అహర్నిశలు శ్రమించి పండించిన పంటకు ప్రభుత్వం మద్దతు ధర చెల్లిస్తున్నది. ధాన్యం అమ్ముకోవడానికి ఊర్లోనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నది. ఐకేపీ, డీసీఎంఎస్, పీఏసీఎస్ ద్వారా ధాన్యం సేకరణ చేపట్టాలని ఇప్పటికే అధికారులను కూడా ఆదేశించింది. కరోనా నిబంధనలకు లోబడి కొనుగోలు చేపట్టాలని సూచించింది. ఇందుకు అనుగుణంగా ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా యాసంగిలో 3.99 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేసిన అధికారులు.. 500 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ధాన్యం సేకరణలో భాగంగా పౌరసరఫరాల శాఖ ఐకేపీ, మెప్మా, డీసీఎంఎస్, పీఏసీఎస్లకు క్వింటాలుకు రూ.32 సర్కారు చెల్లిస్తున్నది. కమీషన్ డబ్బులు కూడా వెంటవెంటనే చెల్లిస్తూ అండగా నిలుస్తున్నది.
రైతులు పండించిన పంట ఉత్పత్తులకు సర్కారు మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేస్తున్నది. గ్రేడ్-ఏ రకానికి రూ. 1888, గ్రేడ్-బీ రకానికి రూ. 1868 చెల్లిస్తున్నది. పంట ఉత్పత్తులు అమ్ముకునేందుకు ఇబ్బంది పడకుండా ఊర్లలోనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం ప్రకటించారు. పౌర సరఫరాలశాఖ ద్వారా ధాన్యాన్ని సేకరిస్తుండగా ఐకేపీ, మెప్మా, డీసీఎంఎస్, పీఏసీఎస్ల ఆధ్వర్యంలో కొనుగోలు చేయనున్నారు. పంట పక్షం రోజుల్లో కోతకు రానుండగా.. ఇందుకోసం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తం గా 3.99 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని అంచనా వేసిన అధికారులు గ్రామాల్లో 500 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు.
వివిధ శాఖల ఆధ్వర్యంలో ధాన్యం సేకరణ
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పంట ఉత్పత్తులను ప్రభుత్వం వివిధ ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా కొనుగోలు చేస్తున్నది. పౌర సరఫరాలశాఖతో పాటు సీసీఐ, మార్క్ఫెడ్, నాఫెడ్ సంస్థలు కొంటున్నాయి. ఈ ఏడాది యాసంగిలో వడ్లను పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో కొనుగోలు చేయనుండగా ఐకేపీ, మెప్మా, డీసీఎంఎస్, పీఏసీఎస్ ద్వారా గ్రామాల్లో సేకరిస్తారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో గతేడాది యాసంగిలో గ్రామాల్లోనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయగా.. ఈసారి కూడా పల్లెల్లోనే పంట సేకరించనున్నారు. ఇందుకోసం అదనపు కలెక్టర్లు ఆయా శాఖల అధికారులతో సమావేశం నిర్వహించి సలహాలు, సూచనలు చేశారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఈ సీజన్లో 3.99 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేసిన అధికారులు గ్రామాల్లో 500 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసే అవకాశాలున్నట్లు తెలిపారు.
గతేడాది రూ.19.84 కోట్ల కమీషన్
గతేడాది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఐకేపీ, మెప్మా, డీపీఎంఎస్, పీఏసీఎస్ల ఆధ్వర్యంలో వడ్లు కొనుగోలు చేసి రూ.19.84 కోట్లు కమీషన్ రూపంలో చెల్లించారు. ధాన్యం సేకరణలో భాగంగా పౌరసరఫరాల శాఖ ఐకేపీ, మెప్మా, డీసీఎంఎస్, పీఏసీఎస్లకు క్వింటాలుకు రూ.32 చెల్లిస్తున్నది. పల్లెల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి అందరి రైతుల వద్ద నుంచి మద్దతు ధరతో నిర్వాహకులు పంట సేకరిస్తారు. ఈ సారి కరోనా నిబంధనలు పాటిస్తూ గ్రామాల్లో వరిని కొంటారు.
మహిళా సంఘాలకు మరింత అండ
కన్నెపల్లి, ఏప్రిల్ 8 : ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణ బాధ్యతలు మాకు అప్పగించినందుకు చాలా ఆనందంగా ఉంది. కమీషన్ ద్వారా వచ్చే డబ్బులను ఎక్కువ మంది మహిళలకు రుణాల రూపంలో ఇచ్చే అవకాశం కలుగుతుంది. బ్యాంకుల ద్వారా తీసుకునే డబ్బుతో పాటు ఇలా అదనంగా మహిళా సమాఖ్యలు బలోపేతం చేయడం, మహిళా సంఘాల ద్వారా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం సంతోషంగా ఉంది. ఈ అవకాశం కల్పించిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు.
ఇవి కూడా చదవండి..
మహారాష్ట్ర నుంచి నిజామాబాద్కు రాకపోకల నిలిపివేత
కర్ణాటక సీఎం యడ్యూరప్పకు పదవీగండం: మే 2 తర్వాత మార్పు తప్పదా?
ప్రపంచంలో ఎక్కువ మంది బిలియనీర్లు ఉన్న నగరమేదో తెలుసా?
వకీల్ సాబ్ ప్రివ్యూ చూడటానికి 5 కారణాలు