ప్రత్యేక ప్రతినిధి, ఏప్రిల్ 8 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో ప్రమాదకర బ్రెజిల్ వేరియంట్ వైరస్ వ్యాప్తి చెందుతున్న దాఖలాలు లేవని సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులార్ బయోలజీ (సీసీఎంబీ) డైరెక్టర్ రాకేశ్ మిశ్రా స్పష్టంచేశారు. యూకేతోపాటు, దక్షిణాఫ్రికాకు చెందిన వైరస్ తెలంగాణలో వ్యాప్తిలో ఉన్నదని పేర్కొన్నారు. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రయాణికుల ద్వారా సేకరించిన నమూనాలను పరిశీలించిన తర్వాత బ్రెజిల్ వేరియంట్ ఉనికి లేదని నిర్ధారణకు వచ్చినట్టు బుధవారం నమస్తే తెలంగాణకు వెల్లడించారు. మహారాష్ట్రలో రెట్టింపు మ్యుటేషన్ ఉన్న ప్రమాదకర వైరస్ ప్రస్తుతం తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో ప్రబలుతున్నదని పేర్కొన్నారు. కరోనా వైరస్ వ్యాప్తి వేగంగా ఉన్న క్రమంలో మరోసారి జీనోమ్ సీక్వెన్సీ పరిశోధనల నిర్వహణకు సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. ఇందులో భాగంగానే మహారాష్ట్రతోపాటు దేశంలోని పలు ప్రాంతాలనుంచి నమూనాలను సేకరించినట్టు తెలిపారు.
రెండు వేరియంట్ల కలయికతో కొత్త స్ట్రెయిన్ ఏర్పడటాన్ని వైరస్ రెట్టింపు ఉత్పరివర్తనంగా పేర్కొంటున్నారు. ఎల్ 452ఆర్, ఈ 484క్యూ వైరస్ రకాల కలయికతో కొత్త స్ట్రెయిన్ ఏర్పడిందని పరిశీలనలో వెల్లడైన విషయం తెలిసిందే. తెలంగాణలో దీని ప్రభావం కొంత మాత్రమే ఉన్నదని రాకేశ్మిశ్రా చెప్తున్నారు. తెలంగాణలో విస్తరిస్తున్న వేరియంట్ ఎక్కువ వేగం తో వ్యాపిస్తున్నా తక్కువ తీవ్రత కలిగి ఉన్నదని తెలిపారు. రాష్ట్రంలో వ్యాపిస్తున్న కరోనా వైరస్ జన్యుక్రమాల్లో స్వల్ప మార్పు ఉన్నప్పటికీ.. అది మహారాష్ట్ర మాదిరి ప్రమాదకరంగా లేదని అభిప్రాయపడ్డారు.
వైరస్ వ్యాప్తి తీవ్రంగానే ఉన్నది. దీనికి కొందరి నిర్లక్ష్యమే కారణం. ఇప్పటికీ చాలామంది మాస్కులు ధరించడం లేదు. భౌతికదూరం పాటించడంలేదు. ప్రయాణాలు కూడా యథేచ్ఛగా సాగిస్తున్నారు. మహారాష్ట్ర స్ట్రెయిన్ మన దగ్గర ఉందని చెప్పడానికి ఆధారాలు లేవు. కానీ అవకాశాలున్నాయి. వైరస్ ఏదైనా వేరియంట్లు ఏవైనా ముఖానికి మాస్కులు ధరించడం, భౌతికదూరం పాటించడం, టీకా వేయించుకోవడమే ప్రస్తుతం మనముందున్న పరిష్కార మార్గం. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లకూడదు. ప్రయాణాలు, వేడుకలు, పార్టీలు, ఊరేగింపులకు పూర్తి దూరంగా ఉండాలి. లేకపోతే పరిణామాలు తీవ్రంగా మారుతాయి.
-డాక్టర్ రాజారావు, సూపరింటెండెంట్ గాంధీ దవాఖాన
తెలంగాణలో రెండు వేరియంట్లు ఉన్నట్లు తెలుస్తున్నది. అందులో ఒకటి యూకే వేరియంట్. దీనిపై ఇప్పటికే పలు ఆధారాలున్నాయి. రెండోది మహారాష్ట్ర వేరియంట్. దీనికి ఆధారాలైతే లేవు. మహారాష్ట్ర నుంచి వైరస్ తెలంగాణలోకి వ్యాప్తి చెందే అవకాశాలు అత్యధికం. మహారాష్ట్ర సరిహద్దు జిల్లాలైన ఆదిలాబాద్, నిజామాబాద్ను పరిశీలిస్తే అక్కడ వేగంగా కేసులు విస్తరిస్తున్నాయి. వైరస్ వ్యాప్తిని పరిశీలిస్తే మహారాష్ట్రలోని డబుల్ మ్యుటేషన్కు దగ్గరి పోలికలు న్నాయి.
-డా. కిరణ్ మాదాల, క్రిటికల్ కేర్ నిపుణుడు, నిజామాబాద్ దవాఖాన