ఆదిలాబాద్ జిల్లాకు చేరుకున్న 2,39,700 బుక్స్
త్వరలో మిగతా 2,70,570..
డీఈవో, ఎమ్మార్సీ కార్యాలయాల్లో భద్రం
ఆదిలాబాద్ రూరల్, ఏప్రిల్ 8 : రాష్ట్ర సర్కారు నాణ్యమైన విద్యనందించడమే ధ్యేయంగా ముందుకెళ్తున్నది. పాఠశాలల్లో సకల సౌకర్యాలు కల్పించడగామే గాకుండా ముందస్తుగానే పాఠ్య పుస్తకాలను సరఫరా చేస్తున్నది. 2021-22 విద్యా సంవత్సరానికి ఆదిలాబాద్ జిల్లాకు 5,10,270 బుక్స్ అవసరముండగా, ఇప్పటికే 2,39,700 పంపించింది. డీఈవో, ఎమ్మార్సీ కార్యాలయాల్లో వాటిని భద్రపరుస్తుండగా, విద్యాసంస్థల ప్రారంభం రోజే విద్యార్థులకు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నది.
జిల్లాలోని ప్రభుత్వ, జడ్పీ, ఆశ్రమ, కేజీబీవీ, మాడల్ స్కూళ్లు, రెసిడెన్షియల్ పాఠశాలలు, గురుకులాల్లో సుమారు 65,270 మంది విద్యార్థులు ఉన్నారు. 2021-22 విద్యా సంవత్సరానికి సంబంధించిన పాఠ్యపుస్తకాలు జిల్లాకు రావడం ప్రారంభమైంది. ఏప్రిల్లోనే జిల్లా కేంద్రాల్లోని పాయింట్లకు పంపిస్తున్నారు. గతంలో ఆగస్టు, సెప్టెంబర్ వచ్చినా విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, యూనిఫాంలు అందేవి కావు. కానీ.. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పాఠశాలల ప్రారంభానికి ముందే చేరవేస్తుంది. ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన పాఠ్యపుస్తకాలు గురువారం జిల్లా కేంద్రానికి చేరుకున్నాయి. ఇప్పటికే 50 శాతం పుస్తకాలు వచ్చాయని అధికారులు పేర్కొంటున్నారు.
ప్రారంభం రోజే పుస్తకాలు..
వచ్చే ఏడాది విద్యా సంవత్సరం ప్రారంభం రోజే పాఠ్యపుస్తకాలు విద్యార్థులకు అందించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నది. చైల్డ్ఇన్ఫోలో విద్యార్థుల సంఖ్య ఆధారంగా జిల్లాకు పాఠ్యపుస్తకాలను పంపిణీ చేస్తున్నారు. ఆర్టీసీ కార్గో ద్వారా ఈ ఏడాది పాఠ్యపుస్తకాలను ప్రభుత్వం పంపిణీ చేస్తుంది. ఆదిలాబాద్ జిల్లాకు సుమారు 5,10,270 పాఠ్యపుస్తకాలు అవసరముండగా, ఇప్పటికే 2,39,700 పుస్తకాలను జిల్లాకు చేరవేసింది. జిల్లా విద్యాశాఖ కార్యాలయం, ఎమ్మార్సీ కార్యాలయాల్లో వీటిని భద్రపరుస్తున్నారు. ఈ నెలాఖరులోగా పుస్తకాలను ఆయా మండల కేంద్రాల్లోని ఎమ్మార్సీ కార్యాలయాలకు తరలించి, అక్కడి నుంచి మే నెలలో పాఠ్యపుస్తకాలను ఆయా పాఠశాలలకు పంపేందుకు జిల్లా విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక ఓపెన్ స్కూల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పదో తరగతిలో 4222 మంది, ఇంటర్లో 3009 మంది అడ్మిషన్లు తీసుకున్నారు. ఉమ్మడి జిల్లాకు సంబంధించిన పుస్తకాలను గురువారం ఓపెన్స్కూల్ కో ఆర్డినేటర్ అశోక్ ప్రత్యేక వాహనాల్లో ఆయా అధ్యయన కేంద్రాలకు తరలింపజేశారు.
ప్రారంభం రోజే అందిస్తాం
జిల్లాలోని ప్రభుత్వ రంగ విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థులకు సంబంధించిన పాఠ్యపుస్తకాలు జిల్లాకు చేరుతున్నాయి. ఇప్పటి వరకు 50శాతం పుస్తకాలు స్టాక్పాయింట్లలో నిల్వ చేశాం. పాఠశాలల ప్రారంభం రోజే వాటిని పంపిణీ చేస్తాం. అన్ని మీడియంలకు సంబంధించిన పుస్తకాలు అందిస్తాం.