సీఎం కేసీఆర్ నిర్ణయంతో ఉపాధ్యాయులు, సిబ్బంది సంబురాలు
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 12,600 మందికి లబ్ధి
ప్రైవేట్ టీచర్లకు గుడ్న్యూస్ చెప్పిన సర్కారు
నెలకు రూ.2 వేలు, 25 కిలోల బియ్యం
ఆదిలాబాద్, ఏప్రిల్ 8 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కరోనా నేపథ్యంలో ప్రైవేట్ టీచర్లు, సిబ్బందిపై సీఎం కేసీఆర్ కరుణ చూపారు. ఆపత్కాలంలో వారి కుటుంబాలను ఆదుకునేందుకు కీలక నిర్ణయం తీసుకున్నారు. జీతాలు లేక ఇబ్బంది పడుతున్న వారికి నెలకు రూ.2 వేలు, 25 కిలోల బియ్యం ఇవ్వాలని నిర్ణయించారు. బ్యాంక్ అకౌంట్లతో కలెక్టర్కు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఫలితంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 12,600 మందికి లబ్ధి చేకూరనుంది. ప్రైవేట్ టీచర్లు, సిబ్బంది హర్షం వ్యక్తం చేస్తున్నారు.
కరోనా కారణంగా విద్యాసంస్థలు మూసివేయడంతో ప్రైవేట్ ఉపాధ్యాయులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభు త్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉపాధ్యాయులు, సిబ్బందిని ఆర్థికపరంగా ఆదుకునేందుకు ముందుకు వచ్చింది. ఉపాధ్యాయులు, సిబ్బందికి నెలకు రూ.2 వేలు, 25 కిలోల బియ్యం ఇవ్వాలని నిర్ణయించింది. ఇందుకోసం ప్రభుత్వ గుర్తింపు పొందిన ప్రైవేట్ పాఠశాలల టీచర్లు, సిబ్బంది బ్యాంక్ అకౌంట్లతో కలెక్టర్లకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 505 ప్రభుత్వ గుర్తింపు పొందిన ప్రైవేట్ పాఠశాలలు ఉండగా, సర్కారు తీసుకున్న నిర్ణయంతో 12,600 ఉపాధ్యాయులు, సిబ్బందికి ప్రయోజనం చేకూరనున్నది. ఆదిలాబాద్ జిల్లాలో 120 ప్రైవేట్ పాఠశాలలుండగా 2 వేల మంది ఉపాధ్యాయులు, సిబ్బంది, నిర్మల్ జిల్లాలో 175 పాఠశాలలకుగానూ 3500 టీచర్లు, సిబ్బంది, మంచిర్యాల జిల్లాలో 150 పాఠశాలలు ఉంటే 6 వేల మంది టీచర్లు, సిబ్బంది, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 60 స్కూళ్లు ఉండగా, 1100 మంది సిబ్బంది ఉన్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ప్రైవేట్ స్కూళ్ల టీచర్లు, సిబ్బంది సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఇది మంచి నిర్ణయం
కరోనా కారణంగా ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు బాగా నష్టపోవాల్సి వచ్చింది. గతేడాది ఏప్రిల్ నుంచి స్కూళ్లు మూసివేయడంతో ఆర్థికపరమైన ఇబ్బందులు పడుతున్నాం. స్కూళ్లలో పనిచేసే టీచర్లు వేతనాలు లేక ఇతర పనులు చూసుకుంటున్నారు. ఇలాంటి ఆపత్కాలంలో ముఖ్యమంత్రి కేసీఆర్ టీచర్లు, సిబ్బందిని ఆదుకునేలా నిర్ణయం తీసుకున్నారు. ఏడాది కాలంలో పాఠశాలలు పనిచేయకపోవడంతో ప్రభుత్వ విధివిధానాలు ఉపాధ్యాయులు, సిబ్బందిని ఆదుకునేలా ఉండాలి