జిల్లాలో 3 సర్పంచ్ స్థానాలు, 29 వార్డులు ఖాళీ..
ఉప ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయం
పోలింగ్ కేంద్రాల ఏర్పాటుకు డ్రాఫ్ట్..
14న తుది జాబితా
వరంగల్రూరల్, ఏప్రిల్ 6 (నమస్తేతెలంగాణ): జిల్లాలో ఖాళీగా ఉన్న సర్పంచ్ స్థానాలు, పంచాయతీ వార్డులకు ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయం మేరకు పోలింగ్కేంద్రాల ఏర్పాటుకు మంగళవారం డ్రాఫ్ట్ రూపొందించారు. వీటిపై బుధవారం ఆయా గ్రామం, పంచాయతీ వార్డుల్లో ముసాయిదా విడుదల చేయనున్నారు. అదేరోజు నుంచి ఈనెల 10వ తేదీ వరకు పోలిం గ్ కేంద్రాల ఏర్పాటుపై అభ్యంతరాలు స్వీకరిస్తారు. 9న రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం, 11న అభ్యంతరాలను పరిష్కరిస్తారు. 12న పోలింగ్ కేంద్రాల జాబితా కలెక్టర్నుంచి ఆమోదం పొందిన తర్వాత 14న పోలిం గ్ కేంద్రాల తుది జాబితా ప్రకటిస్తారు. రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు జరిగే గ్రామాలు, వార్డుల పరిధిలోని ఓటర్ల జాబితాలను గ్రామ పంచాయతీ, ఎంపీడీవో కార్యాలయం వద్ద ఇప్పటికే డిస్ప్లే చేశారు. పోలింగ్ కేంద్రాల తుది జాబితా తర్వాత ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ చేయనుంది. ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ఆశావహులు తెరపైకి వస్తున్నారు. ఓటర్ల మద్దతు కోసం వ్యూహాలు రచిస్తున్నారు.
మూడు సర్పంచ్ స్థానాలకు..
జిల్లాలో మూడు గ్రామ పంచాయతీల సర్పంచ్ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగనున్నాయి. వీటిలో దుగ్గొండి మండలంలోని లక్ష్మీపురం, నర్సంపేట మండలంలోని దాసరిపల్లి, రాయపర్తి మండలంలోని జైరాంతండా(కే) పంచాయతీలున్నాయి. ఏడాది క్రితం ఈ మూడు పంచాయతీల సర్పంచ్లు మృతి చెందడంతో ఖాళీలు ఏర్పడ్డాయి. జైరాంతండా(కే) రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావుకు చెందిన పాలకుర్తి నియోజకవర్గం పరిధిలోనిది. లక్ష్మీపురం, దాసరిపల్లి ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న నర్సంపేట నియోజకవర్గం పరిధిలోనివి.
ఎన్నికలు జరిగే వార్డులివే..
జిల్లాలో ఇరవై తొమ్మిది వార్డులకు ఉప ఎన్నికలు జరుగనున్నాయి. ఆత్మకూరు మండలం లింగమాడుగుపల్లి, చెన్నారావుపేట మండలం అమృతండా, దుగ్గొండి మండ లం గొల్లపల్లి, దేశిపల్లి, ఖానాపురం మండలం భద్రుతం డా, దబీర్పేట, నర్సంపేట మండలం కమ్మపల్లి, ముత్యాలమ్మతండా, గుంటూరుపల్లి, నెక్కొండ మండలం హరిచంద్తండా, పనికర, రామన్నకుంటతండా, రెడ్లవాడ, పరకాల మండలం వెల్లంపల్లి, పర్వతగిరి మండలం ఏబీతండా, చింతనెక్కొండ, కల్లెడ, రాయపర్తి మండలం జైరాంతండా(ఎస్), బురాన్పల్లి, సంగెం మండలం కృష్ణానగర్, సంగెం, ఎల్గూరురంగంపేట, శాయంపేట మండ లం గట్లకానిపర్తి, పత్తిపాక, దామెర మండలం సింగరాజుపల్లి, నడికూడ మండలం సర్వాపురం పంచాయతీల పరిధిలో ఎన్నికలు జరిగే వార్డులు ఉన్నట్లు జిల్లా పంచాయతీ అధికారి (డీపీవో) చంద్రమౌళి వెల్లడించారు. ఉప ఎన్నికల నిర్వహణకు ఇక్కడ అధికారులు ప్రతి వార్డులో ఒక పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేయనున్నారు.
ఇవి కూడా చదవండి..
కరోనాపై గూగుల్ డూడుల్ ప్రత్యేక సందేశం
18 ఏళ్లు దాటిన వారికి టీకా ఇవ్వండి.. ప్రధానిని కోరిన ఐఎంఏ