మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలే సాగు చేయాలి
పంట మార్పిడి విధానంపై రైతులు ఆలోచించాలి
దొడ్డురకం వరిని వీడి.. సన్నరకంపై దృష్టి సారించాలి
వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి
మదనాపురం/కొత్తకోట, ఏప్రిల్5: రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. సోమవారం కొత్తకోట మండలంలోని అమడబాకుల, అప్పరాల, పామాపురం గ్రామాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలను ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి, వనపర్తి కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషాతో కలిసి మంత్రి ప్రారంభించారు. జగ్జీవన్రామ్ జయంతిని పురస్కరించుకొని కొత్తకోటలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం అమడబాకుల గ్రామంలో బీటీరోడ్డు, ప్రకృతివనం, సబ్స్టేషన్, రైతువేదిక, అప్పరాల గ్రామంలో ప్రకృతివనం, రైతువేదిక భవనాన్ని ప్రారంభించారు. పామాపురంలో సీసీరోడ్డు నిర్మాణానికి భూమిపూజ, ప్రకృతివనం, రైతువేదిక భవనం, డబుల్ బెడ్రూం ఇండ్లను ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి నిరంజన్రెడ్డి మాట్లాడుతూ.. రైతుల కష్టాలను దూరం చేయాలనే సంకల్పంతో 5వేల ఎకరాలకు ఒక రైతు వేదికను ఏర్పాటు చేసి, ప్రతి క్లస్టర్కు వ్యవసాయ విస్తరణ అధికారిని నియమించిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు.
పంటమార్పిడి విధానంపై రైతులు ఆలోచించాలని, మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలు సాగుచేస్తే, రైతులు అధిక లాభాలు ఆర్జించవచ్చన్నారు. వరిసాగులో దొడ్డురకాలను వీడి, సన్న రకాలకే రైతులు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఎమ్మెల్యే ఆల మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఆలోచనా విధానాలతో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందన్నారు. నియోజకవర్గానికి 13వందల డబుల్ బెడ్రూం ఇండ్లు మంజూరయ్యాయని, మంత్రి నిరంజన్రెడ్డి సహకారంతో మరో 15వందల ఇండ్లు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్మన్ వామన్గౌడ్, ఎంపీపీ గుంత మౌనిక, సీడీసీ చైర్మన్ చెన్నకేశవరెడ్డి, ఆర్డబ్ల్యూఎస్ ఈఎన్సీ (రిటైర్డ్) సురేందర్రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ బాలనారాయణ, డీసీసీబీ డైరెక్టర్ వంశీధర్రెడ్డి, రైతుబంధు మండల కో-ఆర్డినేటర్ కొండారెడ్డి, ఉమ్మడి జిల్లా అధికార ప్రతినిధి ప్రశాంత్, మండల కో-ఆప్షన్ సభ్యుడు అల్లాబాషా, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ రాజేశ్వరమ్మభీంరెడ్డి, మాజీ జెడ్పీటీసీ విశ్వేశ్వర్, సర్పంచులు బుచ్చనప్న, హిమబిందు, శారదమ్మ, ఎంపీటీసీలు శేషిరెడ్డి, లక్ష్మీగోవిందు పాల్గొన్నారు.
కొవిడ్ జాగ్రత్తలు పాటించాలి
కరోనా సెంకడ్ వేవ్ దృష్ట్యా ప్రభుత్వ సూచనలను, జాగ్రత్తలను విధిగా పాటించాలని మంత్రి నిరంజన్రెడ్డి ప్రజలను కోరారు. నియోజకవర్గంలో సీఎం సహాయనిధికి దరఖాస్తు చేసుకున్న 70మంది బాధితులకు మంజూరైన చెక్కులను సోమవారం క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా, పట్టణ, ఆయా మండల నాయకులతో కలిసి బాధితులకు చెక్కులతో పాటు పండ్లను మంత్రి నిరంజన్ రెడ్డి పంపిణి చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న ఉచిత కొవిడ్ టీకాలను 45సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ వేయించు కోవాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వేణుగోపాల్, ఆర్డీవో అమరేందర్, మున్సిపల్ చైర్మన్ గట్టుయాదవ్, వైస్ చైర్మన్ శ్రీధర్, మార్కెట్ యార్డు వైస్ చైర్మన్ మహేశ్వర్రెడ్డి, కౌన్సిలర్లు లక్ష్మీనారాయణ, రవి, సత్యం, జంపన్న, రాములు, మాజీ కౌన్సిలర్లు తిరుమల్, రమేశ్ పాల్గొన్నారు.
ప్రజల సహకారం మరువలేనిది
రోడ్ల విస్తరణకు ప్రజల అందించే సహకారం మరువలేనిదని మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని పాన్గల్ రహదారిలో రోడ్డు విస్తరణలో భాగంగా ఆర్కే రవి కుటుంబ సభ్యులకు గల 8ఇండ్లను స్వచ్ఛందంగా కూల్చివేతకు ముందుకు రాగా మంత్రి స్వయంగా వారి నివాస గృహాల వద్దకు వెళ్లి ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజలు కోరుకున్నట్లు పట్టణాన్ని అన్ని విధాలా అభివృద్ధి దిశగా తీసుకెళ్తానని మంత్రి హామీ ఇచ్చారు.
పేదలపెన్నిధి..బాబు జగ్జీవన్రామ్
పేదలపెన్నిధి, నవ భారత నిర్మాణానికి కృషి చేసిన మహనీయుడు బాబు జగ్జీవన్రామ్ అని మంత్రి నిరంజన్రెడ్డి, కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయ ఆవరణలో జగ్జీవన్రామ్ జయంతి ఘనంగా నిర్వహించారు. ఆయా కార్యక్రమాల్లో మున్సిపల్ చైర్మన్ గట్టుయాదవ్, కౌన్సిలర్లు చీర్లసత్యం, జంపన్న, నక్క రాములు, మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్రెడ్డి, మహేశ్, మురళీ పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి
బ్లాక్ కాఫీ.. గుండెకు మంచిదేనా?