సెలూన్లు, లాండ్రీలు, ధోబీఘాట్లకు 250 యూనిట్ల ఉచిత విద్యుత్
ఈ నెల ఒకటి నుంచే అమలు.. బీసీ సంక్షేమ శాఖ జీవో జారీ
ఉమ్మడి జిల్లాలో 20వేల మంది నిర్వాహకులకు ప్రయోజనం
నాయీబ్రాహ్మణులు, రజకుల హర్షాతిరేకాలు
ముఖ్యమంత్రి చిత్రపటాలకు పాలాభిషేకాలు
కరీంనగర్ తెలంగాణచౌక్, ఏప్రిల్ 5 : జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో రజకులు, నాయీబ్రాహ్మణులకు ఇచ్చిన హామీ మేరకు ఫ్రీగా కరెంట్ అందించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు ఇవ్వగా, ఆ వెంటే బీసీ సంక్షేమశాఖ జీవో జారీ చేసింది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సుమారు 3 వేల క్షౌరశాలలు, 18 వేలకు పైగా లాండ్రీలు, ధోబీఘాట్ల నిర్వాహకులకు ప్రయోజనం చేకూరనున్నది. కరోనా సమయంలో ఆదాయం లేక, అద్దెలు కట్టలేక అవస్థలు పడుతున్న నిర్వాహకులకు సీఎం నిర్ణయంతో ఒక్కో షాపునకు 1600 వరకు లబ్ధి చేకూరనుండగా, కులవృత్తిదారులు హర్షం వ్యక్తం చేశారు. క్షౌర శాలలకు (కటింగ్ షాపులు), లాండ్రీలు, దోబీఘాట్లకు నెలకు 250 యూనిట్లవరకు నాణ్యమైన విద్యుత్తును ఉచితంగా ఇవ్వడమే కాకుండా, ఈ నెల 1 నుంచి అమలు చేయాలని చెప్పడంతో సంబురాల్లో మునిగితేలారు. కరీంనగర్లోని తెలంగాణచౌక్, హుజూరాబాద్, చొప్పదండి, జగిత్యాల జిల్లా కేంద్రంతో పాటు మెట్పల్లి, కోరుట్ల, పెద్దపల్లి, సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట, ఇల్లంతకుంట, తదితర చోట్ల సీఎం కేసీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకాలు చేశారు.
వెలుగులు నింపిండు..
ముఖ్యమంత్రి కేసీఆర్ సెలూన్ షాపులకు ఉచిత కరెంట్ ఇచ్చి మా బతుకుల్లో వెలుగులు నింపిండు. ఇన్నేండ్లు అచ్చిన సంపాదనలో సగం దాకా దుకాణాల కిరాయికి, బిల్లులకే పోతుండే. అప్పొసప్పో చేసి బతుకులను వెళ్లదీసినం. సర్కారు నిర్ణయంతో మాకు ఎంతో మేలు కలుగుతుంది. అంతో ఇంతో చేతిలో పైసలు కనిపిస్తయి. మా కుటుంబాలన్నీ సీఎం సారుకు రుణపడి ఉంటయి.
సూత్రపు పరమేశ్, నాయీబ్రాహ్మణ సేవా సంఘం పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు
ఇవి కూడా చదవండి..
కరోనా రెండో వేవ్ ఎఫెక్ట్: షిర్డీ సాయిబాబా ఆలయం మూత!
మహారాష్ట్రలో కొత్తగా 47,288 కరోనా కేసులు