‘న్యాక్ ఏ గ్రేడ్’ సాధించని ఆదిలాబాద్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల
స్పష్టమైన లోపాలతో మరోసారి బీ గ్రేడే..
తాత్కాలిక ఏర్పాట్లకే యాజమాన్యం మొగ్గు..
మౌలిక వసతుల కల్పనలో అలసత్వం..
కనిపించని ఆన్లైన్ బోధన
ఆదిలాబాద్ రూరల్, ఏప్రిల్ 2: ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాల న్యాక్ గుర్తింపులో ఏ గ్రేడ్ సాధించ లేకపోయింది. ముచ్చటగా మూడోసారి కూడా బీ గ్రేడ్ వద్దే నిలిచింది. మార్చి 15, 16 తేదీల్లో కళాశాలకు వచ్చిన న్యాక్ బృందం సభ్యులు ఇక్కడి వసతులపై సంతృప్తి చెందలేదు. ఈ సారైనా కళాశాలకు ఏ గ్రేడ్ వస్తుందనుకున్న వారంతా యాజమాన్యం తీరుతోనే ఇలా జరిగిందని విమర్శిస్తున్నారు. తాత్కాలిక వసతులపైనే కళాశాల నిర్వాహకులు దృష్టి పెట్టడాన్ని, న్యాక్ ప్రతినిధులు పసిగట్టినట్లు సమాచారం. కళాశాలకు న్యాక్ బృందం వస్తున్నదని తెలిసినా, అందుకు తగినట్లు కళాశాల సిబ్బంది ఏర్పాట్లు చేయలేదనే వాదనలు వినిపిస్తున్నాయి. అప్పటికప్పుడు తాత్కాలిక ల్యాబ్లు, గార్డెన్, లైబ్రరీలను సిద్ధం చేయడంతో వాటిని న్యాక్ బృందం సభ్యులు గమనించినట్లు సమాచారం. బృందం పర్యటన నేపథ్యంలోనే కళాశాలను సుందరంగా తీర్చిదిద్దారని, తాత్కాలిక ఏర్పాట్లు చేసినట్లు వారు నివేదిక ఇచ్చినట్లు తెలిసింది. లైబ్రరీ ఉన్నప్పటికీ ఆన్లైన్ విధానం, క్యాంటీన్ లేకపోవడంతో పాటు , క్రీడల్లో యూనివర్సిటీ స్థాయిలో విద్యార్థులు పాల్గొనకపోవడం.. ఇలా అనేక రకాల లోపాలు న్యాక్ పరిశీలనలో తేలాయి.
న్యాక్బృందం అసహనం
కొన్నేళ్లుగా కళాశాలకు వచ్చిన నిధుల ఆడిట్ కూడా చేయకపోవడం పై న్యాక్బృందం అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ముందు నుంచి కళాశాలలో వసతుల కల్పనపై సిబ్బంది పెద్దగా పట్టించుకున్న దాఖలాలు లేవు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రస్తుతం ఆన్లైన్, వర్చువల్, జూమ్ పద్ధతుల్లో విద్యాబోధన సాగుతున్నది. కానీ డిగ్రీ కళాశాలలో ఇంకా ఆన్లైన్ బోధన, ప్రొజెక్టర్ ద్వారా బోధన పద్ధతులు అందుబాటులో లేవు. దీనికి తోడు కళాశాలకు వచ్చే విద్యార్థుల సంఖ్య కూడా తక్కువగా ఉంటున్నదని న్యాక్బృందం సభ్యులు గుర్తించినట్లు సమాచారం. సైన్స్ ల్యాబ్లో పాత పరికరాలు వాడడం కూడా మరో కారణమనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కనీసం లైబ్రరీలో సరైన పుస్తకాలు అందుబాటులో లేకపోవడం, అక్కడ విద్యార్థులు కూర్చొని చదువుకునే సౌకర్యం కల్పించకపోవడంపై న్యాక్ సభ్యులు విస్మయానికి గురైనట్లు తెలిసింది. మరోవైపు న్యాక్బృందం నిర్వహించిన పూర్వ విద్యార్థుల సమావేశానికి అతి తక్కువ మంది హాజరుకావడం కూడా మరో కారణంగా తెలుస్తున్నది. మొత్తానికి ఈ ఏడాదైనా ఏ గ్రేడ్ సాధిస్తుందనుకున్న ప్రభుత్వ డిగ్రీ కళాశాల.. మూడోసారి కూడా బీ గ్రేడ్ కే పరిమితమవడం ఇటు విద్యార్థులను, అటు తల్లిదండ్రులను నిరాశకు గురిచేసింది.