హైదరాబాద్, ఏప్రిల్ 1 (నమస్తే తెలంగాణ): దేశంలోనే మొదటిసారిగా తెలంగాణలోనే అసలైన గ్రామస్వరాజ్య స్థాపన జరుగుతున్నదని ఐటీ, పరిశ్రమలు, పురపాలకశాఖల మంత్రి కే తారకరామారావు అన్నారు. సీఎం కేసీఆర్ వినూత్నంగా చేపట్టిన పల్లెప్రగతి కార్యక్రమం విజయవంతంగా నడుస్తున్నదని చెప్పారు. ప్రతినెలా ఇస్తున్న రూ. 308 కోట్లు గ్రామాల అభివృద్ధికి తోడ్పడుతున్నాయని అన్నారు. ఇప్పుడు గ్రామాల్లో ట్రాక్టర్లు, ట్రాలీలు, ట్యాంకర్లు వచ్చాయని, నర్సరీలు, డంప్ యార్డులు, పల్లె ప్రకృతి వనాలు, శ్మశాన వాటికలు ఏర్పడ్డాయని, నిత్యం పారిశుద్ధ్య పనులతో గ్రామాలు అద్దా ల్లా తయారయ్యాయని చెప్పారు. గ్రామాల్లో కరోనా వ్యాప్తి తగ్గడమే కాకుండా, అంటు, సీజనల్ వ్యాధుల జాడేలేకుండా పోయిందని అన్నారు. ప్రగతిభవన్లో గురువారం మంత్రులు కేటీఆర్, ఎర్రబెల్లి దయాకర్రావు సమావేశమయ్యారు. దీన్దయాళ్ ఉపాధ్యా య పంచాయతీ సశక్తీకరణ్ పురస్కార్కు రాష్ట్రంలోని 12 స్థానిక సంస్థలు ఎంపికవడంపై కేటీఆర్ ప్రశంసలు కురిపించారు. దేశంలోనే అత్యుత్తమ గ్రామపంచాయతీలుగా 9, మండలాలుగా 2, ఒక జిల్లా పరిషత్ అవార్డులకు ఎంపికవడంపై సంతోషం వ్యక్తంచేశారు. రాష్ర్టానికి వరుస అవార్డులు వచ్చేలా పనిచేస్తున్న అధికారులు, ప్రజాప్రతినిధులు, సిబ్బందిని అభినందించారు. ఇదే తరహా పనితీరును కొనసాగిస్తూ, రాష్ర్టానికి మరింత పేరు వచ్చేలా చేయాలని సూచించారు. ఈ సందర్భంగా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, కార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియా, కమిషనర్ రఘునందర్రావుకు శుభాకాంక్షలు తెలిపి సన్మానించారు.