గురుకుల విద్యార్థులకు గ్రామాల్లోనే పాఠ్యాంశాల బోధన
అనుమానాలు నివృత్తి చేస్తున్న టీచర్లు
చదువులో సహకారం అందిస్తున్న స్వేరోలు
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 1,400 కేంద్రాలు
బోథ్, ఏప్రిల్ 1 : గురుకుల విద్యార్థులు చదువుకు దూరం కాకుండా ఉండేందుకు వీఎల్సీ (విలేజ్ లర్నింగ్ సెంటర్)లు ఏర్పాటు చేశారు. గ్రామాల్లోనే పాఠ్యాంశాల బోధన చేయిస్తున్నారు. ఉపాధ్యాయులు కేంద్రాలను సందర్శిస్తూ విద్యార్థుల అనుమానాలను నివృత్తి చేస్తున్నారు. స్వేరోలు తమవంతు సహకారం అందిస్తున్నారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 17 గురుకులాలు ఉండగా.. ఒక్కో దాంట్లో 550 మంది విద్యను అభ్యసిస్తున్నారు. ఇందుకోసం 1400 కేంద్రాలు ఏర్పాటు చేశారు. కొవిడ్-19 నిబంధనలకు అనుగుణంగా బోధన కొనసాగుతున్నది.
ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా పరిధిలో ఉన్న 17 తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలు (బాలబాలికలు) ఉన్నాయి. వీటిలో ఐదు నుంచి ఇంటర్ వరకు తరగతులున్నాయి. ఒక్కో తరగతిలో 60 నుంచి 80 మంది విద్యార్థుల చొప్పున ఒక్కో గురుకులంలో సుమారు 550 మంది విద్యనభ్యసిస్తున్నారు. వీరి కోసం సుమారు 1400 వీఎల్సీలు ఏర్పాటు చేశారు. కొవిడ్ నేపథ్యంలో గురుకులాలకు సెలవులు ప్రకటించడంతో విద్యార్థులు చదువుకునేందుకు వీలుగా గురుకులాల సెక్రటరీ ప్రవీణ్కుమార్ సూచనల మేరకు తెరిపించారు. గ్రామాల్లో 5వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం వరకు చదువుతున్న విద్యార్థులు ఒకేచోట చేరి చదువుకుంటున్నారు. కాగా, తమ చదువు ఏమవుతుందోనన్న ఆందోళనను విద్యార్థుల్లో తొలగించి భరోసా కల్పించారు.
ఆదిలాబాద్, మంచిర్యాల, ఆసిఫాబాద్, నిర్మల్ జిల్లా (ప్రసుత్తం నిజామాబాద్ జిల్లా రీజియన్ కిందకు వెళ్లాయి) పరిధిలోని గురుకుల విద్యార్థులకు పాఠ్యాంశాల బోధనతో పాటు వారి అనుమానాలను నివృత్తి చేయడానికి ఒక్కో ఉపాధ్యాయుడికి ఐదారు వీఎల్సీ కేంద్రాల బాధ్యతలను అప్పగించారు. వారు నిత్యం కేంద్రాలను సందర్శించేలా షెడ్యూల్ రూపొందించారు. వీఎల్సీల్లో బ్లాక్ బోర్డులు, హ్యాంగింగ్ బోర్డులు, రోలింగ్ బోర్డులు, మార్కర్లు, చాక్పీస్ తదితర సామగ్రిని అందించారు. తరగతుల వారీగా నోట్బుక్లు, పాఠ్య పుస్తకాలను విద్యార్థులకు పంపిణీ చేశారు. ఉపాధ్యాయులు కేంద్రాలకు వచ్చి పాఠాలు చెబుతున్నారు. కేంద్రాల పరిధిలో ఉన్న స్వేరోలు వచ్చి విద్యార్థులకు సహాయ సహకారాలు అందిస్తున్నారు. విద్యార్థులంతా ఒకేచోట చేరి చదువుకుంటే భవిష్యత్లో పోటీ పరీక్షలకు, గ్రూప్ డిస్కషన్గా కూడా ఉపయోగపడే వీలు కలుగుతున్నది. రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతుండడంతో గురుకులాలు పునః ప్రారంభమయ్యే వరకు వీఎల్సీల నిర్వాహణను కొనసాగించేలా ప్రణాళికలు రూపొందించారు.
చదువుకు దూరం కాకుండా ఉండేందుకే..
విద్యార్థులు చదువుకు దూరం కాకుండా ఉండేందుకే గ్రామాల్లో వీఎల్సీ కేంద్రాలు ఏర్పాటు చేయించాం. కరోనా నేపథ్యంలో రెండోసారి ప్రభుత్వం విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించడంతో విద్యార్థుల దృష్టి మళ్లకుండా ఉండేందుకు వీటిని కొనసాగిస్తున్నాం. కేంద్రాల సందర్శన బాధ్యతను ఉపాధ్యాయులకు అప్పగించాం. విద్యార్థుల అనుమానాలను ఎప్పటికప్పుడు నివృత్తి చేయిస్తున్నాం.