ఇంద్ర వాటర్ శుద్ధీకరణ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు
ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి
గ్రేటర్ కమిషనర్ పమేలా సత్పతి
వరంగల్, మార్చి 31 : కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో జీడబ్ల్యూఎంసీకి వివిధ పనులపై వచ్చే ప్రజల కోసం డిస్ఇన్ఫెక్షన్ యంత్రం ఏర్పాటు చేసినట్లు కమిషనర్ పమేలా సత్పతి తెలిపారు. సామాజిక బాధ్యతలో భాగంగా ఇంద్ర వాటర్ శుద్ధీకరణ సంస్థ ఏర్పాటు చేసిన వజ్ర కవచ్ యంత్రాన్ని బుధవారం ఆమె ప్రారంభించి మాట్లాడారు. తక్కువ వ్యయంతో ఎక్కువగా పనిచేసే యంత్రాన్ని అందజేయడం హర్షణీయమన్నారు. మేకిన్ ఇండియాలో భాగంగా డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ సహకారం, ఆస్కీ భాగస్వామ్యంతో యంత్రాన్ని ఏర్పాటు చేసినట్లు వివరించారు. కార్యాలయానికి వివిధ పనులపై వచ్చే వారు ఈ యంత్రాన్ని వినియోగించుకోవాలని కోరారు. మాస్కులు, జాకెట్స్, గాడ్జెట్లు, మెడికల్ యంత్రాలు, ఫేస్ షీల్డ్లు, గ్లౌజెస్ను ఈ యంత్రంలో మూడు నిమిషాల పాటు ఉంచితే బ్యాక్టీరియా, వైరస్ను అంతం చేస్తుందని ఆమె చెప్పారు. సిబ్బంది నిరంతరం వాడే మాస్కులు, గ్లౌజ్లు, పీపీఈ కిట్లను క్రిమిరహితం చేసుకోవాలని కమిషనర్ సూచించారు. కార్యక్రమంలో అదనపు కమిషనర్ నాగేశ్వర్, ఆస్కీ ప్రతినిధులు రాజ్మోహన్, అవినాశ్, ఇంద్ర కంపెనీ సహ వ్యవస్థాపకుడు అభిజిత్, ఇంజినీర్లు శివ, భాస్కర్ పాల్గొన్నారు.
పనుల్లో నాణ్యత పాటిస్తేనే బిల్లుల చెల్లింపులు
అభివృద్ధి పనుల్లో నాణ్యత పాటిస్తేనే బిల్లులు చెల్లిస్తామని గ్రేటర్ కమిషనర్ పమేలా సత్పతి స్పష్టం చేశారు. కుడా అధ్వర్యంలో 6వ డివిజన్ తిమ్మాపూర్, అల్లీపూర్లో చేపట్టిన అభివృద్ధి పనులను బుధవారం ఆమె తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ పనుల్లో నాణ్యత లేకుంటే బిల్లుల్లో కోత విధిస్తామని అన్నారు. ఎంబీ రికార్డుల ప్రకారం బిల్లులు చెల్లిస్తామని చెప్పారు. అభివృద్ధి పనులు గడువులోగా పూర్తి చేసేలా ఇంజినీర్లు చర్యలు తీసుకుకోవాలని ఆమె ఆదేశించారు. కమిషనర్ వెంట కుడా ఈఈ భీంరావు, ఏఈ సిద్ధార్థనాయక్ ఉన్నారు.
కమిషనర్ను కలిసిన సిటీ ప్లానర్ వెంకన్న
గ్రేటర్ సిటీ ప్లానర్గా బుధవారం బాధ్యతలు చేపట్టిన బీ వెంకన్న కమిషనర్ పమేలా సత్పతిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. జీహెచ్ఎంసీలో సిటీ ప్లానర్గా పనిచేస్తున్న ఆయన 15 రోజుల క్రితం జీడబ్ల్యూఎంసీకి బదిలీపై వచ్చారు. ఇక్కడ ఇన్చార్జి సిటీ ప్లానర్గా విధులు నిర్వర్తించిన నర్సింహరాములు గ్రేటర్ హైదరాబాద్కు బదిలీ అయిన విషయం తెలిసిందే. అయితే, డివిజన్ల పునర్విభజన నేపథ్యంలో నర్సింహరాములు కొద్ది రోజుల పాటు ఇక్కడే విధులు నిర్వర్తించారు.