కరోనా నుంచి రక్షణ పొందుతూ.. కట్టడి చేసేందుకు ప్రతి ఒక్కరూ ఎస్ఎంఎస్ సూత్రాన్ని పాటించాలని పోలీసులు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ‘సేఫ్ డిస్టెన్స్, మాస్క్, శానిటైజేషన్ హ్యాండ్స్’ తప్పక అలవాటు చేసుకోవాలని తెలుపుతున్నారు. ఇటీవల కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో హైదరాబాద్, రాచకొండ కమిషనర్ల ఆదేశాల మేరకు బుధవారం జంట కమిషనరేట్ల పరిధిలోని ముఖ్య కూడళ్లలో శాంతిభద్రతలు, ట్రాఫిక్ పోలీసులు ప్లకార్డులు పట్టుకొని ప్రజలకు పలు సూచనలు చేశారు. విధిగా మాస్క్ ధరించి మనతో పాటు మన కుటుంబాన్ని కాపాడుకుందామని పిలుపునిచ్చారు. నిబంధనలు క్రమంతప్పకుండా పాటిస్తే కరోనా మన దరిచేరదని చెబుతున్నారు.
నిబంధనలు పాటిద్దాం.. కరోనాను కట్టడి చేద్దాం.. అందరం విధిగా మాస్క్లు ధరిద్దాం.. మనతో పాటు మన కుటుంబాన్ని కరోనా నుంచి కాపాడుకుందాం.. అంటూ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్, రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్భగవత్ పిలుపునిచ్చారు. ఎస్ఎంఎస్ సూత్రాన్ని ప్రతి ఒక్కరూ తప్పక పాటించాలని సూచించారు. బుధవారం బషీర్బాగ్లోని పోలీస్ కమిషనర్ కార్యాలయం చౌరస్తాలో ప్లకార్డులు పట్టుకొని ప్రజలకు అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా సీపీలు మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటమే లక్ష్యంగా అన్ని పోలీస్స్టేషన్ల పరిధిలోని ముఖ్య కూడళ్లలో శాంతి భద్రతలు, ట్రాఫిక్ పోలీసులు అవగాహన కల్పిస్తున్నారని తెలిపారు. జేబులో శానిటైజర్ బాటిల్, ముఖానికి మాస్క్ తప్పనిసరిగా ఉండాలని సూచించారు. ఎక్కువ మంది గుమిగూడవద్దని, మతపరంగా జరిగే కార్యక్రమాల్లో పాల్గొనవద్దని తెలిపారు. బషీర్బాగ్ చౌరస్తాలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో సీపీ అంజనీకుమార్తో పాటు అదనపు సీపీలు శిఖాగోయెల్, అనిల్కుమార్, చౌహాన్, జాయింట్ సీపీలు తరుణ్జోషి తదితర అధికారులు పాల్గొన్నారు.