కొన్ని: కేరళలోని శబరిమల ఆలయానికి భారీ స్థాయిలో భక్తుల రాక తగ్గిపోయింది. దాంతో పాటు ఆదాయం కూడా పడిపోయింది. కోవిడ్ నిబంధనల నేపథ్యంలో భక్తుల రాకను అధికారులు అడ్డుకుంటున్న విషయం తెలిసిందే. అయితే ఈనెలలో జరిగిన ఉత్తరమ్ వేడుకతో పాటు మీనం నెల పూజల కోసం భక్తులకు అనుమతి ఇచ్చినా.. చాలా స్వల్ప సంఖ్యలో భక్తులు ఆ కార్యక్రమాలకు హాజరయ్యారు. మార్చి 14 నుంచి మార్చి 28వ తేదీ వరకు అయ్యప్పస్వామి ఆలయాన్ని తెరిచి ఉంచారు. ఆ సమయంలో కేవలం 25వేల మంది భక్తులు మాత్రమే అయ్యప్పస్వామిని దర్శించుకున్నట్లు అధికారులు తెలిపారు. నిజానికి ఆ సమయంలో సుమారు 1.5 లక్షల మంది భక్తులు వస్తారని అధికారులు అంచనా వేశారు.
ఆలయం తెరిచి ఉంచిన సమయంలో ప్రతి రోజు పది వేల మంది భక్తులకు దర్శనం కోసం అనుమతి ఇచ్చారు. కానీ దాంట్లో సగం మంది కూడా రోజువారీగా హాజరుకాలేకపోయినట్లు అధికారులు చెప్పారు. అతి స్వల్ప సంఖ్యలో భక్తులు రావడం వల్ల దేవాలయ ఆదాయం కూడా గణనీయంగా పడిపోయింది. శబరిమల దేవస్థానం బోర్డు 15 రోజుల్లో కేవలం 1.25 కోట్లు మాత్రమే ఆర్జించింది. 2019లో ఇదే సీజన్లో ఆలయ బోర్డు సుమారు 16 కోట్లు ఆర్జించినట్లు అధికారులు తెలిపారు.
ప్రస్తుతం కోవిడ్ నెగటివ్ సర్టిఫికేట్ ఉంటేనే భక్తులను శబరిమలకు అనుమతి ఇస్తున్నారు. ఆదాయం పడిపోవడంతో ఆలయ బోర్డు సాంప్రదాయబద్దంగా పంబా వద్ద నిర్వహించాల్సిన కొన్ని కార్యక్రమాలను నిలిపివేసినట్లు తెలుస్తోంది. రాబోయే మీడం నెల పూజలు, విష్ణు ఉత్సవాలకు జనం అధిక సంఖ్యలో శబరిమలకు వస్తారని అధికారులు ఆశిస్తున్నారు.