ఖమ్మం కల్చరల్, మార్చి 28: ఆరోగ్యమే ఏడు రంగుల రంగేలీగా ఉమ్మడి జిల్లా ప్రజలు హోలీ పండుగను ఆదివారం ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు. ఫాల్గుణ శుద్ధ పౌర్ణమిని వసంతానికి స్వాగత సన్నాహంగా సప్తవర్ణ శోభితం చేశారు. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో బహిరంగ ఉత్సవాల నిషేధాజ్ఞలతో హోలీ పండుగను ప్రజలు తమ తమ ఇండ్ల వద్దనే జరుపుకున్నారు. అక్కడక్కడా మాత్రమే చిన్నారులు పరస్ఫరం రంగులు పులుముకొని ఆనందించారు.రహదారుల వెంట సమూహాలుగా ఏర్పడకుండా పోలీసులు పెట్రోలింగ్ నిర్వహించారు. గుంపులుగా ఏర్పడితే కరోనా సోకే ప్రమాదం ఉన్నందున వ్యక్తిగతంగానే రంగులను తమ సమీప బంధువులు, స్నేహితులపై చల్లుకుని ఆనందించారు. ప్రధానంగా ఈ దఫా వర్చువల్ హోలీకి ప్రాధాన్యం ఇచ్చారు.తమ స్నేహితుల ఫొటోలకు రంగులు పులిమి ఫేస్బుక్, వాట్సాప్లలో పోస్ట్ చేసి ఆనందాన్ని పంచుకున్నారు. భక్తులు ఆలయాలకు తరలివెళ్లి తమ తమ ఇష్టదైవాలకు పూజలు చేశారు. శనివారం రాత్రి కామ దహనం చేసి తమలోని అరిషఢ్వర్గాలను త్యజించి, ఆనందంతో హోలీ పండుగను జరుపుకున్నారు.
ఇవీ కూడా చదవండి..