పుస్తకాలు చదువుతున్న సమయంలో తాత్కాలిక భావోద్వేగాలు కలుగవచ్చు. కానీ, మన ఆలోచనలు, నిర్ణయాలు తీసుకునే విధానంలోనూ ఆ పుస్తకాల ప్రభావం ఎంతో కొంత ఉంటుంది.
అక్షర లక్షల ‘వేణునాదం’
నిరంతర అధ్యయనం, సామాజిక బాధ్యత, అనురక్తి, సంఘసేవ, మానవతావాదం, శాస్త్రసాంకేతిక విజ్ఞానం, ప్రయాణం వెరసి నాగసూరి వేణుగోపాల్! పుట్టింది రాయలసీమలోని కుగ్రామమైనా ఆయన తన ప్రగతి సోపానాల్ని తానే స్వయంగా నిర్మించుకున్నారు. ఇంచుమించు ప్రధాన నగరాలన్నింటా ఆకాశవాణిలో పనిచేశారాయన. తన జీవితంలోని ఎన్నెన్నో పార్శ్వాలను ఈ పుస్తకంలో ఆసక్తికరంగా వివరించారు. అన్నిటికన్నా ముఖ్యం తన బహుముఖ ప్రజ్ఞతోపాటు అనేకమంది ప్రముఖులతో, సాహితీవేత్తలతో సాగించిన సత్సాంగత్యం. నార్ల, నండూరి, పొత్తూరి, బూదరాజు, కూచిమంచి, సర్దేశాయి.. ఒకరా ఇద్దరా ఎందరో మహానుభావులు, వారినుంచి ఏదో నేర్చుకోవాలన్న జిజ్ఞాస! ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూనే అనేక రచనలు చేశారు నాగసూరి. వాటికోసం ఎన్నో పరిశోధనలు చేశారు. మరోపక్క హేతువాద దృక్పథం, సైన్సు ఆవశ్యకత తెలిపే రచనలు ఆయన కలం నుంచి వెలువడ్డాయి. నిరంతర ఉత్సాహం, నిరంతర పఠనం, సునిశిత పరిశీలన, నిర్మల హృదయం ఆయనను ముందుకు నడిపించాయంటే అతిశయోక్తి కాదు. ఈ ‘వేణునాదం’లో ఎన్ని జ్ఞాపకాలు, ఎన్ని మధుర అనుభవాలు, ఎన్నెన్ని ఆసక్తికర విశేషాలంటే ప్రతిఒక్కటీ అపురూపమే! కాల్పనిక సాహిత్యం కాకపోయినా చదివించే శక్తి ఈ పుస్తకానికి పుష్కలం.
వేణునాదం
రచన: డా. నాగసూరి వేణుగోపాల్
పేజీలు: 240, వెల: రూ. 200
ప్రతులకు : నవోదయ బుక్ హౌస్, కాచిగూడ క్రాస్ రోర్డ్సు, హైదరాబాద్
విలీనం కథ
నేటి తెలంగాణ ముక్కోటి రతనాల వీణ. నాటి తెలంగాణ నిలువెల్ల గాయాల సీమ. దేశమంతా అచ్చమైన స్వేచ్ఛా గాలులు వీస్తున్నా ఇక్కడ నిరంకుశం రాజ్యమేలింది. రాచరికం నుంచి ప్రజాస్వామ్యానికి మారడానికి హైదరాబాద్ స్టేట్ పడిన పురిటి నొప్పులు అన్నీఇన్నీ కావు. రజాకార్ల దురాగతాలు, వాటికి బలైన జీవితాల గురించి నేటికీ తెలంగాణలోని పల్లెపల్లెలో కథలు వినిపిస్తూనే ఉంటాయి. రైతాంగ సాయుధ పోరాటం వీరగాథలకు సాక్ష్యాలెన్నో దర్శనమిస్తుంటాయి. అనేక పోరాటాల తర్వాత హైదరాబాద్కు స్వాతంత్య్రం సిద్ధించింది. అఖండ భారతావనిలో హైదరాబాద్ విలీన ఘట్టం ఓ అపురూపం. దీనివెనుక జరిగిన మంత్రాంగం గురించి ఎవరి భాష్యం వారిది. కానీ, ఈ విలీనంలో కీలకపాత్ర పోషించిన అప్పటి కేంద్ర హోం మంత్రిత్వ శాఖలో అంతర్భాగంగా ఉన్న రాష్ర్టాల వ్యవహారాల శాఖ కేబినెట్ సెక్రటరీ వి.పి.మీనన్ ఆ ఘటనలకు పరిపూర్ణ సాక్షి. భారతదేశంలో సంస్థానాల విలీన ఘట్టాలన్నిటినీ కలిపి ‘ద స్టోరీ ఆఫ్ ద ఇంటిగ్రేషన్ ఆఫ్ ద ఇండియన్ స్టేట్స్’ పుస్తకంలో పొందుపరిచారు ఆయన. ఈ ఆంగ్ల పుస్తకంలోని హైదరాబాద్ భాగాన్ని ‘అసఫ్జాహీ సంస్థానం విలీనగాథ’ పేరుతో ఏనుగు నరసింహారెడ్డి అనువదించారు. యథాతథ ఒప్పందం, ఉల్లంఘనలు, పోలీసు చర్య ఇలాంటి మలుపులన్నీ ఇందులో ప్రస్తావించారు. ఈ పుస్తకం ద్వారా విలీన కథను సంపూర్ణంగా అర్థం చేసుకోవచ్చు.
వి.పి.మీనన్
అసఫ్జాహీ సంస్థానం విలీనగాథ
అనువాదం: ఏనుగు నరసింహారెడ్డి
పేజీలు: 136, వెల: రూ.100
ప్రతులకు: అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలు
సమాజంపై లేఖాస్త్రం
ఉత్తరం రాసి ఎన్నాళ్లయింది? ఆత్మీయుల లేఖ అందుకొని ఎన్నేండ్లయింది? ‘ఉభయకుశలోపరి..’ అంటూ క్షేమ సమాచారంతో మొదలయ్యే లేఖలో ఎన్నెన్నో భావాలుండేవి. ఓ లేఖ కష్టాసుఖాలను ఏకరువు పెడితే, మరో లేఖ కర్తవ్యాన్ని నూరిపోసేది, ఇంకో లేఖ ప్రేమకావ్యమై పుస్తకాల్లో పదిలంగా దాగిపోయేది. కానీ, ఈ తరానికి ఉత్తరాల చిరునామా గల్లతయ్యింది. సంక్షిప్త సందేశాల పలకరింపులు రావడంతో సందేహాల నివృత్తి మృగ్యమైంది. మన జీవితాల్లో నుంచి తొంభై ఆమడల దూరం వెళ్లిపోయిన తోకలేని పిట్టలను మళ్లీ పట్టి తెచ్చే ప్రయత్నమే ‘లేఖావలోకనం’. సాహితీ జగత్తులో తన ఉనికిని చాటుకున్న లేఖా సాహిత్యానికి మరోసారి ఊపిరులూదారు సంకలన సంపాదకులు జ్వలిత. అదేసమయంలో ప్రస్తుతం సమాజం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఆడపిల్ల భద్రత, పసిపిల్లలపై లైంగిక దాడులు. ఈ అంశాన్ని వస్తువుగా మలుచుకొని లేఖాస్త్రం సంధించాలని పిలుపునిచ్చారు. ఏండ్లుగా ఉత్తరాలు రాయడం మరచిపోయిన వారంత కలం విదిల్చారు. ఆడపిల్లల విషయంలో ఎదురవుతున్న సమస్యలను గుర్తు చేస్తూ సమాజానికి హితవు పలికారు. ఈ ఉత్తరాల పొత్తం ప్రస్తుత సమాజంలో ఆడపిల్లల దుస్థితికి, వారి తల్లిదండ్రుల ఆందోళనలకూ అద్దం పట్టింది. చదవాల్సిన పుస్తకమిది.
తోకలేని పిట్టలు మన జీవితాల్లో నుంచి తొంభై ఆమడల దూరం వెళ్లిపోయాయి.
లేఖావలోకనం
సంపాదకులు: జ్వలిత
పేజీలు: 254 వెల: రూ.250
ప్రతులకు: అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలు