పల్లె ప్రగతితో మారిన గ్రామ రూపురేఖలు
1500 మొక్కలతో పల్లె ప్రకృతి వనం
సుమారు రూ.కోటితో అభివృద్ధి పనులు
పూర్తికావస్తున్న జీపీ, మహిళా బిల్డింగ్
10 వేల లీటర్లతో కొత్త ట్యాంకు
హరితహారం మొక్కలు అదుర్స్
అక్కన్నపేట, మార్చి 26:గ్రామంలోని పాఠశాల ఆవరణలో ఒకే చోట పలు నిర్మాణాలు చేపట్టారు. ఇక్కడ ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనంలో సుమారు 1500 వరకు పండ్లు, పూల, ఔషధ, నీడనిచ్చే మొక్కలు పెంచుతున్నారు. ఇక్కడే రూ.22లక్షలతో రైతు వేదిక భవనాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. దీనికి సమీపంలో అంగన్వాడీ కేంద్రం, రూ.10 లక్షలతో మహిళా సంఘం భవనం, రూ.16 లక్షలతో పంచాయతీ భవన పనులు చేపట్టగా, అవి దాదాపు 80శాతం పూర్తయ్యాయి. అలాగే, రూ.16 లక్షలతో 20 కల్లాలు, రూ.5 లక్షలతో 10 పశువుల పాకలు నిర్మించారు. పంచాయతీ నిధులతో ట్రాక్టర్, ట్రాలీ, ట్యాంకర్ కొన్నారు. సుమారు రూ.12 లక్షలతో సీసీ రోడ్లు, మిషన్కాకతీయ కింద ముష్కవానికుంటకు రూ.10లక్షలు, పంబాలకుంట రూ.13 లక్షలతో మరమ్మతు పనులు, పంచాయతీ నిధుల నుంచి రూ.2 లక్షల డ్రైనేజీ పనులు చేశారు. ఊరు చుట్టూ హరితహారంలో భాగంగా మొక్కలు నాటి, వాటికి టీగ్రార్డ్సు ఏర్పాటు చేశారు. వివిధ రకాల మొక్కలు నాటేందుకు నర్సరీని సిద్ధం చేస్తున్నారు.
డంపింగ్యార్డు నిర్మించి, అందులో ఎరువు తయారు చేస్తున్నారు. రూ.12.50లక్షలతో వైకుంఠధామ పనులు తుది దశకు చేరాయి. ఎప్పటికప్పుడు స్వచ్ఛత, పారిశుధ్య పనులు కొనసాగుతున్నాయి. ప్రతి వీధిలో స్ట్రీట్ లైట్లు ఏర్పాటు చేయగా, రాత్రి వేళల్లో వెన్నెల కురిపిస్తున్నాయి. ఊరికి నాలువైపులా సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. పంచాయతీ ట్యాంకర్ ద్వారా హరితహరం మొక్కలకు నీళ్లు పోస్తున్నారు. గ్రామంలో 10వేల లీటర్ల సామర్థ్యంతో అదనంగా మిషన్భగీరథ వాటర్ ట్యాంకును నిర్మించి, వినియోగంలోకి తెచ్చారు. కాగా, ఇటీవల రైతు వేదిక ప్రారంభోత్సవానికి వచ్చిన మంత్రి హరీశ్రావు, పల్లె ప్రకృతి వనం బాగుందంటూ మెచ్చుకున్నారు.