హైదరాబాద్: మహానగరాన్ని మరింత స్వచ్ఛంగా తీర్చిదిద్దేందుకు జీహెచ్ఎంసీ చర్యలు తీసుకుంటున్నది. ఇందులో భాగంగా చెత్త తరలింపునకు మరో 650 స్వచ్ఛ ఆటోలను కొనుగోలు చేసింది. ఇవాళ 325 స్వచ్ఛ ఆటోలను మంత్రి కేటీఆర్ ప్రారంభిస్తారు. హైదరాబాద్లోని నెక్లెస్ రోడ్డులో ఉదయం 9 గంటలకు ఈ ఆటోలను ప్రారంభించనున్నారు.
నగరంలో ఇప్పటికే 2500 స్వచ్ఛ ఆటోల ద్వారా చెత్త సేకరిస్తున్నారు. డ్రైవర్ కం ఓనర్ పథకం ద్వారా 5 వేల మందికి ఉపాధి కల్పిస్తున్నారు. ఒక్కో చెత్త ఆటోలో డ్రైవర్తోపాటు హెల్పర్ ఉంటారు. కాగా స్వచ్ఛ ఆటో టిప్పర్ల రాకతో 2016 సంవత్సరంలో 3500 మెట్రిక్ టన్నుల సామర్థ్యం ఉండగా 2017 నాటికి 4500 మెట్రిక్ టన్నులకు చేరుకున్నది. ప్రస్తుతం 5,600 మెట్రిక్ టన్నుల చెత్తను సేకరిస్తున్నారు. తాజాగా వచ్చిన 650 స్వచ్ఛ టిప్పర్లను 30 సర్కిళ్లకు కేటాయించనున్నారు.