మొండి టీబీకి అందుబాటులో మందులు
జిల్లాలో 2,064 మంది వ్యాధిగ్రస్తుల గుర్తింపు
క్షయ నివారణలో భద్రాద్రి జిల్లాకు నేషనల్ అవార్డు
నేడు క్షయ వ్యాధి నివారణ దినోత్సవం
కొత్తగూడెం మార్చి 23 :క్షయకు అత్యాధునిక వైద్యం అందుబాటులోకి వచ్చింది. ఎంతటి దగ్గయినా ఏడాదిలో తగ్గేలా కొత్త మందులొచ్చాయి. గతంలో రెండు, మూడేళ్లు మందులు వాడాల్సి వచ్చేది. కానిప్పుడు ఏడాదిపాటు మందులు వాడితే మొండి టీబీ సైతం మటుమాయమవుతున్నది. క్షయ తగ్గుముఖం పట్టేలా ఫిక్స్డ్ డోస్ కాంబినేషన్ (ఎఫ్డీసీ) మందులు అందుబాటులోకి తేవడంతో వ్యాధిగ్రస్తుల సంఖ్య తగ్గుతూ వస్తున్నది. జిల్లాలో 2,103 మంది వ్యాధిగ్రస్తులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
ప్రస్తుతం క్షయకు అత్యాధునిక వైద్యం అందుబాటులోకి వచ్చింది. ఎంతటి దగ్గయినా ఏడాదిలో తగ్గేలా కొత్త మందులొచ్చాయి. గతంలో రెండు, మూడేళ్లు మందులు వాడాల్సి వచ్చేది. కానిప్పుడు ఏడాదిపాటు మందులు వాడితే మొండి టీబీ సైతం మటుమాయమవుతున్నది. అయినా దగ్గును ఎట్టిపరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయకూదడని వైద్యులు చెబుతున్నారు. దగ్గే కదా అని నిర్లక్ష్యం చేస్తే ఇబ్బందులు ఎదురవుతాయి. తెలిసిన మాత్రలు మింగి అశ్రద్ధ చేస్తే టీబీ సోకే అవకాశాలున్నాయి.
దగ్గులో చాలా రకాలు
దగ్గులో చాలా రకాలున్నాయి. జలుబు, వాతావరణం మార్పులు ద్వారా వచ్చే దగ్గు, కోరింత దగ్గు, పొడి దగ్గు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. కాని టీబీ ద్వారా వచ్చే దగ్గు సైలెంట్కిల్లర్ అని చెప్పుకోవాలి. నోటితుంపర్లు, గాలివ్యాప్తికి ఒకరి నుంచి ఒకరికి సోకితే వచ్చే ప్రాణాంతకమైన టీబీ మానవప్రాణాలను హరిస్తోంది. మైకోబ్యాక్టీరియం టెబెర్క్లోసిస్ అనే క్రిమి ద్వారా సోకుతుంది. అయితే, ఇది సోకినప్పుడు మనిషిలో రోగనిరోధకశక్తి తగ్గిపోతుంది. క్షయకు భయపడకుండా వైద్యులను సంప్రదించి మందులు వాడితే ఆరు నెలల్లో నయమవుతుంది. నిర్లక్ష్యం చేస్తే ప్రాణానికే ప్రమాదం. గత జనవరి నుంచి ఇప్పటి వరకు భద్రాద్రి జిల్లాలో 36 మంది మృతిచెందినట్లు లెక్కలు చెబుతున్నాయి. రక్తహీనత, షుగర్,హెఐవీ ఉన్న రోగులకు టీబీ వచ్చే అవకాశాలున్నాయి.
జిల్లాలో 2,064 మంది వ్యాధిగ్రస్తుల గుర్తింపు
జిల్లాలో 2,064 మందికి టీబీ ఉన్నట్లు వైద్యశాఖ గుర్తించింది. జిల్లాలో అత్యధిక కేసులు నమోదు చేసిన ఆ శాఖ ప్రోగ్రాం ఆఫీసర్ గతేడాది రాష్ట్రస్థాయిలో అవార్డును అందుకున్నారు. గతంలో భద్రాచలంలో ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో క్షయ నిర్ధారణ పరీక్షలు చేసేవారు. ఇప్పుడు కొత్తగూడెంలో కూడా అందుబాటులోకి వచ్చింది. జిల్లాలో 17 కేంద్రాల్లో తెమడ పరీక్షలు చేసి మందులు పంపిణీ చేస్తారు. భద్రాచలంలో సీబీనాట్ అనే పరీక్ష ద్యారా మొండి టీబీని గుర్తించ వచ్చు.
రూ.15 లక్షలతో కొత్తగూడెంలో..
కొత్తగూడెంలో టీబీ పరీక్ష సెంటర్ అందుబాటులోకి వచ్చింది. టీబీ పరీక్షలు చేసి వెంటనే వైద్యం అందిస్తారు. ఉమ్మడి జిల్లాలో ఏజెన్సీ ప్రాంతం ఎక్కువగా ఉన్న భద్రాచలంలో ఈ సెంటర్ను ఏర్పాటు చేశారు. కొత్త జిల్లా ఏర్పాటుతో కొత్తగూడెం ఏరియా ఆసుపత్రికి టీబీ సెంటర్ మంజూరు చేసి అందుబాటులోకి తీసుకొచ్చారు. దీనివల్ల టీబీ రోగులకు దూరాభారం తగ్గింది. క్షయ నిర్మూలన కోసం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ మొబైల్ వాహనాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. గ్రామాల్లో దగ్గు ఉన్నవారిని పరీక్షించి మందులు అందజేస్తారు. ప్రభుత్వం క్షయ నిర్మూలనలో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టింది.
క్షయ నివారణలో భద్రాద్రి జిల్లాకు నేషనల్ అవార్డు
క్షయ నివారణలో భద్రాద్రి జిల్లాకు జాతీయ స్థాయి అవార్డు దక్కింది. ఐదేళ్లుగా క్షయ వ్యాధిగ్రస్తుల రికవరీ రేటు ను తగ్గించడంలో రాష్ట్రంలోనే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నంబర్ వన్ స్థానంలో నిలిచింది. జాతీయ స్థాయిలో కేవలం మూడు అవార్డులు మాత్రమే ఇస్తారు. అందులో భద్రాద్రి జిల్లా ఉండడం గర్వకారణమని జిల్లా వైద్యాధికారి డాక్టర్ భాస్కర్ నాయక్ అన్నారు.