బీసీల విద్యకు ప్రోత్సాహం కల్పించాలి: సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ, మార్చి 22: సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన వర్గాల (బీసీల) అభ్యున్నతికి కోసం విద్యను ప్రోత్సహించే చర్యలు చేపట్టాలని, మరిన్ని విద్యాసంస్థలు నెలకొల్పాలని అన్ని రాష్ర్టాలకు సుప్రీంకోర్టు సూచించింది. అట్టడుగు వర్గాలకు విద్య, ఉద్యోగాల్లో అవకాశాలు పెంచడమంటే రిజర్వేషన్లు కల్పించడం మాత్రమే కాదని స్పష్టంచేసింది. ‘ఇతర చర్యలు ఎందుకు తీసుకోకూడదు? విద్యను ప్రోత్సహించి, మరిన్ని విద్యాసంస్థలు ఎందుకు నెలకొల్పకూడదు? రిజర్వేషన్లను మించి ముందడుగు వేయాల్సిన అవసరం ఉన్నది’ అని కోర్టు అభిప్రాయపడింది. మరాఠా కోటా కేసుపై జస్టిస్ అశోక్ భూషణ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం సోమవారం విచారణ కొనసాగించింది. ఈ కేసులో మంగళవారం కూడా వాదనలు కొనసాగనున్నాయి. గత శుక్రవారం విచారణ సందర్భంగా కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఇంకెన్ని తరాలు రిజర్వేషన్లు కొనసాగిస్తారని, 50 శాతం పరిమితిని ఎత్తివేస్తే అసమానతలు తలెత్తవా అని ప్రశ్నించింది.