చెన్నై: ఒక మంత్రి కారు వద్ద ప్రత్యర్థి పార్టీ కార్యకర్తలు పటాకులు కాల్చారు. దీంతో తనపై హత్యాయత్నం జరిగిందని ఆరోపిస్తూ ఆయన ఫిర్యాదు చేశారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రచారంతోపాటు ఫిర్యాదులు హోరెత్తుతున్నాయి. అధికార అన్నాడీఎంకేకు చెందిన సమాచార, ప్రచార శాఖ మంత్రి కదంబర్ రాజు ఆదివారం కోవిల్పట్టిలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కారులో వెళ్తుండగా ఏఎంఎంకే కార్యకర్తలు పటాకులు పేల్చారు. ఈ నేపథ్యంలో తనపై హత్యకు ప్రత్యర్థి కార్యకర్తలు ప్రయత్నించారని ఆయన ఆరోపించారు.
ఏఎంఎంకే కార్యకర్తలు తన కారును అడ్డుకుని పటాకులు కాల్చారని, తద్వారా అందులో ఉన్న తనతోపాటు కారుకు నిప్పుపెట్టబోయారని కదంబర్ రాజు తెలిపారు. తాను తృటిలో తప్పించుకున్నానని లేనిపోతే కారుకు మంటలు అంటుకుని తాను మరణించి ఉండేవాడినని అన్నారు. ఎన్నికల్లో తన గెలుపునకు భయపడి తనను హత్య చేసేందుకు ఏఎంఎంకే ప్రయత్నించిందని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
మరోవైపు అన్నాడీఎంకే కేంద్ర కార్యదర్శి దీనిపై ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేశారు. కాగా, తమ కార్యకర్తలపై మంత్రి కదంబర్ రాజు చేసిన ఆరోపణలపై ఏఎంఎంకే ఇంకా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు.