తాజా ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికల్లో కమలం వాడిపోయింది. సిట్టింగ్ స్థానంలో బీజేపీకి ఊహించని షాక్ తగిలింది. దుబ్బాక, జీహెచ్ఎంసీకి జరిగిన ఎన్నికల్లో ప్రభావం చూపిన ఆపార్టీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాత్రం తోకముడిచింది. పట్టభద్రుల నుంచి ఆశించిన ఆదరణ దక్కలేదు. దీంతో కేంద్రంలో చక్రం తిప్పుతున్న బీజేపీ, తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాత్రం ముఖం చాటేసింది. ఒకటి, రెండు చోట్ల గెలుపుతో ఇక తమకు ఎదురేలేదంటూ.. విర్రవీగిన ఆ పార్టీకి తాజా ఎమ్మెల్సీ ఎన్నికలు చెంప పెట్టుగా మారాయి.
అన్ని వర్గాల నుంచి..
హైదరాబాద్-రంగారెడ్డి- మహబూబ్నగర్ జిల్లాల పట్టభద్రుల స్థానంలో గ్రేటర్ హైదరాబాద్ పరిధి ఎంతో కీలకం. హైదరాబాద్తో పాటు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో భారీ సంఖ్యలో పట్టభద్రుల ఓటర్లు ఉన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు అన్ని వర్గాల ప్రజలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. ప్రధానంగా పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు కొన్ని నెలలుగా పెరుగుతూనే ఉండటంతో ప్రజలు ఎంతో భారంగా భరిస్తూ వస్తున్నారు. వీటికి తోడు కేంద్రం పరిధిలోని ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేసి తీరతామన్న ప్రకటన ఉద్యోగులు, వారి సంబంధిత వర్గాల్లో ఆగ్రహాన్ని పెంచింది. ఇదే రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో బీజేపీ ఓటమికి దారితీసింది.
అభ్యర్థిపై వ్యతిరేకత…
బీజేపీ ఓటమికి ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ, ఇంధన ధరల పెంపు ఒక కారణమైతే.. అభ్యర్థిగా ఎన్. రాంచందర్రావు ఎంపికపై పార్టీ శ్రేణులు అసంతృప్తితో ఉన్నాయి. క్షేత్రస్థాయిలోని నాయకులు, కార్యకర్తలను పట్టించుకోకుండా ఎంపిక చేయడంతో ప్రచారంలో మొక్కుబడిగానే పాల్గొని, తమ అయిష్టతను వ్యక్తం చేశారు. దీనికితోడు ఇంధన ధరల పెరుగుదల ప్రభావం.. ఆ పార్టీ నేతలను ఓటర్ల దగ్గరకు వెళ్లనీయకుండా చేసింది.
కేంద్రం తీరుతో ..
దేశాన్ని ఎంతో ముందుకు నడిపిస్తారని భావించిన ప్రధాని నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను విక్రయిస్తామని కరాఖండిగా చెప్పడం ఉద్యోగుల్లో ఆగ్రహాన్ని తెప్పించింది. తెలంగాణ ప్రభుత్వం రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తూ, ప్రభుత్వ రంగ ఉద్యోగులకు అండగా నిలుస్తుంటే.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మాత్రం ఇందుకు పూర్తి విరుద్ధంగా వ్యవహరిస్తున్నది. పైగా విద్యుత్ రంగాన్ని ప్రైవేటుపరం చేసేందుకు ప్రత్యేకంగా విద్యుత్ సవరణ బిల్లు-2020ను సిద్ధం చేసింది. తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీ సాక్షిగా దీనిని వ్యతిరేకించింది. తెలంగాణలోని ట్రాన్స్కో, జెన్కో, టీఎస్ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్ వంటి సంస్థల ఉద్యోగులకు అండగా నిలిచింది. బీజేపీ విధానాలతో ఆగ్రహంగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు ఆ పార్టీకి బుద్ధి చెప్పేందుకు ఇదే సరైన సమయంగా భావించి.. కమలానికి వ్యతిరేకంగా, తెలంగాణ ప్రభుత్వానికి మద్దతుగా నిలిచారని తాజాగా ఎన్నికల ఫలితాలతో వెల్లడైంది.