హైదరాబాద్ : హైదరాబాద్-రంగారెడ్డి- మహబూబ్నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ సుదీర్ఘంగా సాగింది. ఈ నెల 17 నుంచి 20వ తేదీ వరకు నాలుగు రోజుల పాటు సరూర్నగర్ ఇండోర్ స్టేడియంలో ఈ ఓట్ల లెక్కింపు నిర్వహించారు. సుమారు తొంభై గంటల పాటు నిర్విరామంగా కౌంటింగ్ ప్రక్రియ సాగడం తెలంగాణ రాష్ట్ర చరిత్రలోనే రికార్డుగా చెప్పవచ్చు. జీహెచ్ఎంసీ కమిషనర్, హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి డీఎస్ లోకేశ్కుమార్, ఎమ్మెల్సీ రిటర్నింగ్ అధికారి ప్రియాంక ఆలతో పాటు, 50 మంది సీనియర్ అధికారులు ఓట్ల లెక్కింపులో కీలక పాత్ర పోషించారు.
మూడు షిఫ్ట్లు..
ఎన్నికల సంఘం అబ్జర్వర్ హరిప్రీత్సింగ్ పర్యవేక్షణలో జరిగిన ఈ ఓట్ల లెక్కింపులో ప్రతి రోజూ మూడు షిఫ్ట్లుగా, ప్రతి షిప్ట్నకు ఎనిమిది వందల మంది కౌంటింగ్ సిబ్బంది ఎనిమిది హాళ్లలో రోజుకు 2400 మంది చొప్పున నాలుగు రోజుల పాటు 9600 మంది నేరుగా పాల్గొన్నారు. వీరితో పాటు సహాయ రిటర్నింగ్ అధికారులు, జీహెచ్ఎంసీ, రెవెన్యూ సీనియర్ అధికారులు తమ సేవలను అందించారు. ప్రధానంగా జీహెచ్ఎంసీకి చెందిన ఎంటమాలజీ విభాగానికి చెందిన 2100 వర్కర్లు, జంబో బ్యాలెట్ బాక్స్లను స్ట్రాంగ్ రూమ్ల నుంచి కౌంటింగ్ హాల్కు తరలించడం, తిరిగి స్ట్రాంగ్ రూమ్లకు పంపించడంలో చేసిన సంక్షిష్టమైన కృషిని ప్రతి ఒక్కరూ అభినందించారు. ఆదే విధంగా దాదాపు 10వేల మందికి కనీస సౌకర్యాలను, టీ, టిఫిన్, భోజనంతో పాటు లెక్కింపు కేంద్రం పరిశుభ్రంగా ఉంచడంలో ఎల్బీనగర్ జోనల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డి నేతృత్వంలోని అధికారులు విశేష సేవలందించారు..
వివరాలు ఎప్పటికప్పుడు అందించి..
ఎమ్మెల్సీ కౌంటింగ్ వివరాలను ఎప్పటికప్పుడు ఎలక్ట్రానిక్, ప్రింట్ తదితర మాద్యమాల ద్వారా ప్రజలకు అందించడంలో జీహెచ్ఎంసీ సీపీఆర్వో వెంకట రమణ తనదైన సేవలందించారు. స్టేడియం ఆవరణలో మీడియా సెంటర్ను ఏర్పాటు చేశారు. ఇక ఏ విధమైన అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా రాచకొండ పోలీస్ కమీషనర్ మహేశ్ భగవత్ నేతృత్వంలో పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేశారు. మొత్తానికి సుదీర్ఘంగా సాగిన ఓట్ల లెక్కింపు ప్రక్రియను ఏ విధమైన వివాదాలు లేకుండా, కౌంటింగ్ ఏజెంట్లు, పోటీ చేసిన అభ్యర్థుల నుంచి చిన్న ఫిర్యాదు లేకుండా పూర్తి చేయడం పట్ల అధికారులను, సిబ్బందిని పార్టీలకు అతీతంగా నాయకులు అభినందించారు.