భక్తుల జయజయధ్వానాల నడుమ వీరభద్రుడి ఊరేగింపు
అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు
శివ నామస్మరణతో మార్మోగిన కురవి
రథం లాగేందుకు పోటీపడిన భక్తులు
తరలివచ్చిన కోయలు
కురవి, మార్చి 16:ఆడబిడ్డకు కోయల స్వాగతం ప్రతి సంవత్సరం జరిగే రథోత్సవానికి కోయలు ఎక్కువగా హాజరవుతారు. వారు భద్రకాళీ అమ్మవారిని తమ ఇంటి ఆడబిడ్డగా భావించి పూజలు చేస్తారు. ఈ సారి కూడా అధిక సంఖ్యలో వచ్చిన కోయలు రథం ఎదుట నృత్యాలు చేస్తూ తన్మయత్వంలో మునిగిపోయి, భక్తిని చాటుకున్నారు. అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ఎస్పీ కోటిరెడ్డి ఆదేశాల మేరకు రోప్పార్టీతో రూరల్ సీఐ రవికుమార్, కురవి ఎస్సై శంకర్రావు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ బాదావత్ రామూనాయక్ దంపతులు, ఆలయ మాజీ చైర్మన్ రాజూనాయక్ దంపతులు, ఆలయ ఈవో సత్యనారాయణ, ఎంపీటీసీ చిన్నం భాస్కర్, పాలకమండలి సభ్యులు విజయ్, మల్లయ వెంకన్న, వెంకటరమణ, చిత్తనూరి శ్రీనివాస్, మేక నాగిరెడ్డి, తుకారాం, శ్రీనివాస్గౌడ్, పూజారులు రామన్న, అనిల్, శ్రీకర్, విజయ్, పుణ్యమూర్తి, శివ తదితరులు పాల్గొన్నారు.
భద్రకాళీ సమేత వీరభద్రస్వామి కల్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏడో రోజు మంగళవారం రథోత్సవ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. నెలవంక తోడు రాగా.. భద్రకాళీ సమేత వీరభద్రస్వామి కొలువైన రథం భక్తుల జయజయధ్వానాల ముందుకు కదిలింది. శివ నామస్మరణతో కురవి గ్రామం, ఆలయ పరిసరాలు మార్మోగాయి. పూనకాలతో శివసత్తులు శివమూగారు. కోయలు అధిక సంఖ్యలో పాల్గొని వీరభద్రుడి సేవలో తరించారు. ఆలయ పూజారులు, వేదపండితుల వేదమంత్రోచ్ఛారణల నడుమ ఘనంగా పూజలు చేశారు. స్వామి వారిని ఆల యం నుంచి ప్రత్యేకశావలో రథం వద్దకు తీసుకొచ్చారు. బాజాభజంత్రీలు మోగుతుండగా, పూజారులు ఆలయం ఎదుట వాస్తుపూజ నిర్వహించారు. అగ్నిహోమం చేశారు. వీరభద్రస్వామి, భద్రకాళీ అమ్మవార్ల ఉత్సవమూర్తులను శావలో రథంపైకి తీసుకొచ్చిన అనంతరం పూజారులు రథం ముందు దిష్టికుంభం పోసి గుమ్మడికాయ కొట్టారు. దీంతో భక్తుల జయజయధ్వానాల నడుమ భద్రకాళీ సమేత కల్యాణ వీరభద్రుడు వేంచేసి ఉన్న రథం కదిలింది. రాత్రి ఏడు గంటల సమయంలో రంగురంగుల పూలు, విద్యుత్ దీపాలతో అలంకరించిన రథం గుడి ముందు నుంచి కదలింది. రథోత్సవాన్ని తిలకించేందుకు తెలుగు రాష్ర్టాల నుంచి భక్తులు అధికసంఖ్యలో హాజరయ్యారు. స్వామివారి రథాన్ని లాగేందుకు పోటీపడ్డారు. స్వామివారి, అమ్మవారు రథంపై కదిలి వస్తుండగా మహిళలు హారతులతో స్వాగతం పలికారు. గుమ్మడికాయ కొట్టి భక్తిని చాటుకున్నారు. రథోత్సవం సందర్భంగా ఆలయ వీధులు భక్తజనంతో కిక్కిరిసిపోయాయి.