న్యూఢిల్లీ, మార్చి 14: బ్యాంకుల ప్రైవేటీకరణను నిరసిస్తూ ప్రభుత్వ బ్యాంకుల ఉద్యోగులు సోమ, మంగళవారాల్లో సమ్మెకు దిగనున్నారు. యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్(యూఎఫ్బీయూ) ఈ దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చింది. ఇందులో 9 యూనియన్లు ఉన్నాయి. ఐడీబీఐ సహా రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటీకరణ చేస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల బడ్జెట్ ప్రసంగంలో చెప్పడం సమ్మెకు ప్రధాన కారణం. దాదాపు 10 లక్షల మంది ఉద్యోగులు సమ్మెలో పాల్గొననున్నట్టు ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్(ఏఐబీఈఏ) తెలిపింది. దీంతో ఈ రెండు రోజులు బ్యాంకింగ్ సేవలకు అంతరాయం కలుగనుంది. బ్యాంకింగ్ సేవలకు అంతరాయం కలగొచ్చని ఇప్పటికే చాలా బ్యాంకులు ఖాతాదారులకు సమాచారంఅందించాయి. అయితే బ్యాంకు కార్యకలాపాలు యథావిధిగాజరిగేలా తగిన చర్యలు తీసుకొంటున్నట్టు కొన్ని బ్యాంకులు పేర్కొన్నాయి.