6, 7, 8వ తరగతి విద్యార్థులకు సైతం నేరుగా విద్యాబోధన ప్రారంభం కానున్నది. ఈ మేరకు ప్రభుత్వం సూత్రప్రాయ అంగీకారం తెలిపింది. కొవిడ్-19 నిబంధనలతో క్లాసులను నిర్వహించాలని మార్గదర్శకాలను జారీ చేసింది. ఫిబ్రవరి 1న ప్రారంభమైన విద్యా సంవత్సరం మే 26వ తేదీతో ముగియనున్నది. ఇప్పటికే 9, 10వ తరగతి విద్యార్థులకు ఆన్లైన్ తరగతులు ప్రారంభం కాగా.. తాజాగా 6 నుంచి 8వ తరగతి విద్యార్థులకు కూడా నేరుగా విద్యాబోధన చేసేందుకు ప్రభుత్వం అంగీకారం తెలిపింది.
కొవిడ్ నిబంధనల మేరకు తరగతులు నిర్వహించేందుకు విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. పాఠశాలల్లో శానిటైజేషన్ చేయించడం, భౌతిక దూరం పాటించే అంశాలపై స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అవసరమైతే రెండు షిఫ్టుల్లో విద్యార్థులకు క్లాసులను నిర్వహించాలని యోచిస్తున్నారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో మొత్తంగా 181 హై స్కూల్స్, 113 ఎయిడెడ్, 1140 ప్రైవేట్ స్కూళ్లు కలుపుకుని మొత్తంగా 1434 ఉన్నాయి. ఆరో తరగతిలో 60,738, 7వ తరగతిలో 65,437, ఎనిమిదో తరగతిలో 64,413, తొమ్మిదో తరగతిలో 64,664, పదో తరగతిలో 68,981 మంది విద్యార్థులు ఉండగా మొత్తంగా 3,24,233 మంది విద్యనభ్యసిస్తున్నారు. వారందరికీ ఇకపై పాఠశాలల్లోనే తరగతులను నిర్వహించనుండగా, అందుకు సదరు విద్యార్థి తల్లిదండ్రుల అనుమతి పత్రం తప్పనిసరిగా అందించాల్సి ఉంటుంది. ఓవైపు ఆఫ్లైన్ తరగతులు కొనసాగుతుండగానే.. మరోవైపు టీ సాట్ ద్వారా కూడా ఆన్లైన్ పాఠాలను యథాతథంగా ప్రసారం చేస్తారు.
జంట నగరాల్లో నెలకొన్న ట్రాఫిక్ సమస్యల నేపథ్యంలో పాఠశాల నిర్వహణ వేళల్లో మార్పులు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 4.45 గంటల వరకు పాఠశాలలు పనిచేయనుండగా, గ్రేటర్ పరిధిలో మాత్రం కొంచెం ముందుగానే ప్రారంభించనున్నారు. ఉదయం 8.45 గంటలకు పాఠశాలలను ప్రారంభించి, సాయంత్రం 4గంటల వరకే ముగించనున్నారు.