పచ్చళ్లు లేని మెనూ.. తొక్కులు లేని వడ్డనలు ఉంటాయా? పంచభక్ష్య పరమాన్నాలెన్ని ఉన్నా.. కంచం అంచుకు అమ్మ చేసిన పొడులు పడాల్సిందే.ఇలాంటి వెయ్యి రకాల పచ్చళ్లతో పాకశాస్త్ర గ్రంథాన్ని రూపొందించి ‘ఇండియన్ పికిల్స్ క్వీన్’గా రికార్డులకెక్కింది ఉషా ప్రభాకరన్.
పెండ్లయిన కొత్తలో ఉష అత్తగారు తరుచూ వంటల గురించి చెప్తుండేవారు. ‘ఈ పొడి ఇలా కొట్టాలి, ఆ రసం ఇలా చేయాలి, ఈ తొక్కు ఇలా నూరాలి’ అంటూ. ఉషకు అదంతా కొత్తగా అనిపించేది. అయినా, బుద్ధిగా వింటుండేది. పచ్చళ్ల అద్భుతాలను అమెరికాకూ పరిచయం చేస్తూ ఇప్పుడు ఉష ‘పికిల్స్ క్వీన్’గా మారిపోయింది.
పదేండ్ల కృషి : ఉషా ప్రభాకరన్ది చెన్నై. వేసవి వచ్చిందంటే ఉష వాళ్లింట్లో పచ్చళ్ల జాతరే. ఆ అనుభవంతో పచ్చళ్లు, పొడులు, ఊరగాయలు, తొక్కులు వంటి 1,000 రకాల రుచుల తయారీ విధానాలతో ఆమె ఒక పుస్తకమే రాసింది. దానిపేరు ‘ఉషాస్ పికిల్స్ డైజెస్ట్’. ఇది ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయ్యింది. ఈ వెయ్యీ నామమాత్రపు వంటకాలు కాదు. తరాలనుంచి వారసత్వంగా వస్తున్న అరుదైన రుచులు. ఈ పుస్తకం తొమ్మిది విభాగాలుగా ఉంటుంది. క్లాసిక్, యూనిక్ ఫ్లేవర్స్, ఎక్స్క్లూజివ్, అన్యదేశ, క్విక్ సర్వ్, ఆయిల్ ఫ్రీ, డైటరీ.. ఇలా. ‘దినుసులలో కల్తీని ఎలా గుర్తించాలి? ముడి పదార్థాలు కలుషితం కాకుండా ఎలా చూడాలి?’ అన్న సమాచారమూ ఇందులో ఉంది.
ట్యూమర్తో బాధ పడుతూ: పుస్తక ప్రచురణ కోసం ఉష చాలా కష్టపడ్డది. బుక్ మార్కెట్లోకి వచ్చే సమయానికే ‘బ్రెయిన్ ట్యూమర్’ బారిన పడింది. మెదడుకు రెండు శస్త్రచికిత్సలు జరిగాయి. అయినా, ఆమె ధ్యాసంతా పుస్తకంపైనే ఉండేది. శస్త్రచికిత్సలవల్ల పుస్తకాన్ని మార్కెట్లోకి తీసుకురావడానికి ఐదేండ్లు పట్టింది. అక్కడితో ఆగలేదామె. రెండో పుస్తక ఇతివృత్తం ‘రసం’. ‘తెలుగువాళ్లు చారు అని పిలిచే ఈ మధురరసం వివిధ ఆరోగ్య సమస్యలనూ పరిష్కరిస్తుంది. దీనిని చిటికెలో తయారుచేయొచ్చు. ఖర్చూ తక్కువ’ అంటూ పుస్తక పరిచయంలో రాశారు. ఇప్పుడు పొంచివున్న వైరస్ల ముప్పునుంచి మనల్ని కాపాడటంలో ఆహార పద్ధతులు సహకరిస్తాయని అంటున్నది ఉష. టమాట, మిరియాలు, నెయ్యి, జీలకర్ర, బెల్లం, పాలు, పెరుగు, ఆవాలు, కొత్తిమీర, కరివేపాకు వంటివి వ్యాధి నిరోధకతను పెంపొందిస్తాయని చెబుతున్నది. ‘యాంటీ డయాబెటిక్’గా పనిచేసే తోకమెంతుల పచ్చడి, పెరుగు పచ్చడి, ఐరన్ అధికంగా ఉండే అరటిపూల ఊరగాయ వంటివన్నీ తనకు ఇష్టమైనవేనని అంటున్నది.