కుటుంబ పరిస్థితుల కారణంగా చదువును మధ్యలోనే ఆపేసి, మూడున్నర దశాబ్దాల క్రితం ఆరోగ్య కార్యకర్త (ఏఎన్ఎమ్)గా బాధ్యతలు స్వీకరించారు మాధురీ మిశ్రా. అప్పటినుంచి ఇప్పటివరకు ఆగ్రా చుట్టుపక్కల గ్రామాల్లో కొన్ని వేలమందికి టీకాలు అందించారు. మాధురి ఆరోగ్య కార్యకర్తగా మారడానికి ఐదు సంవత్సరాల ముందే.. మశూచి నివారణకు ‘నేషనల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రాం’ ప్రారంభమైంది. నాటి నుంచి ఇప్పటి వరకు ఫతేహాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో 90 శాతం రోగనిరోధక శక్తిని పెంపొందించారు మాధురి. గతవారమే ఆమె పదవీ విరమణ చేశారు. తన అవసరం ఉంటే మళ్లీ సేవల్లో కొనసాగేందుకు సిద్ధంగా ఉన్నానని అంటున్నారామె. నాలుగేండ్ల క్రితమే మాధురి భర్త అనారోగ్యంతో మరణించారు. ఆమె ఇద్దరు కుమారులు కూడా వైద్యరంగంలోనే ఉన్నారు. ‘ఆమె ఏ రోజూ పనికి సెలవు పెట్టలేదు.
పదవీ విరమణ దశలోనూ కొవిడ్ టీకాలు ఇవ్వడానికి రోజుకి 12 గంటలు పనిచేశారు. కొలువులో చిట్టచివరి రోజు కూడా.. ఫ్రంట్లైన్ కార్మికులకు కొవిడ్ టీకాలు అందించారు’ అంటూ మాధురి నిబద్ధతను గుర్తు చేసుకున్నారు జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ సంజీవ్ బర్మన్. ‘అప్పట్లో టీకాలపై అనేక అపోహలూ, అనుమానాలూ ఉండేవి. ఆరోగ్య కార్యకర్తలను ఊళ్లలోకి రానిచ్చేవారు కాదు. పిల్లలకు టీకాలు వేయడానికి ఒప్పుకొనేవారు కాదు. వ్యాక్సిన్లు వంధ్యత్వానికి, జ్వరానికి కారణమవుతాయని భయపడేవారు. వాళ్లకు టీకాల పట్ల అవగాహన కల్పించాను. రోజూ 8 కి.మీ.ల మేర నడిచి పల్లెల్లోని పిల్లలకు టీకాలు అందించాను’ అంటూ తన అనుభవాలను పంచుకుంటున్నారు మాధురి. కృతజ్ఞతలు తల్లీ!