లాక్డౌన్ మొదలైనప్పటి నుంచీ బడిపిల్లలంతా ఇంట్లో నాలుగు గోడలకే పరిమితమయ్యారు. ఆన్లైన్ క్లాసులు, అసైన్మెంట్లతో కుస్తీ పడుతూ వచ్చారు. మెల్లమెల్లగా మార్పును అలవాటు చేసుకున్నారు. ఇదంతా నాణేనికి ఒకవైపు మాత్రమే. మరోవైపు చాలామంది పిల్లలు ఇటు స్కూళ్లు లేక, అటు ఆన్లైన్లో క్లాసులు వినేందుకు ఇంట్లో స్మార్ట్ఫోన్లు లేక ఎంతో ఇబ్బందిపడ్డారు. అలాంటి వాళ్లకోసం తమ గ్రామంలో ఒక క్లాస్రూమ్ను ఏర్పాటు చేసింది తమిళనాడుకు చెందిన 20 ఏండ్ల సంధ్యా షణ్ముగం. కొయంబత్తూరు దగ్గర చిన్నంపతీ ఆమె స్వస్థలం. బీకామ్ చదివింది. ఆ గ్రామంలో తనొక్కతే పట్టభద్రురాలు. సంధ్య చదువుకునే రోజుల్లో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నది. అడవి గుండా బడికి, కాలేజీకి వెళ్లొచ్చేది. ఆ ప్రయాణంలో ఎన్నో చేదు అనుభవాలు. ఆ దుస్థితి మరెవరికీ రావద్దని తన కోరిక. అందువల్లే, ఆన్లైన్ క్లాసులకు అవకాశం లేని పిల్లలకు తానే ఉచితంగా చదువు చెప్పాలని నిర్ణయించుకుంది. ఒక క్లాస్రూమ్ను కూడా ఏర్పాటు చేసింది. గ్రామపెద్దలను, పిల్లల తల్లిదండ్రులను ఒప్పించి పాఠశాలను ప్రారంభించింది. సంధ్యా షణ్ముగం ప్రయత్నాన్ని అందరూ అభినందిస్తున్నారు.