యుగాలకు ఆదిమూలమైన దేవుడు కూడా ఉగాది పండుగ జరుపుకొంటాడు. భూత, భవిష్యత్, వర్తమానాలకు సూత్రధారి అయిన చక్రధారి పంచాంగ శ్రవణంలో పాల్గొంటాడు. తలరాతల దేవుడు బ్రహ్మకే జన్మనిచ్చినవాడు.. శ్రద్ధగా రాశిఫలాలు ఆలకిస్తాడు. తిరుమలలో ఉగాది అతిగొప్ప వేడుక. పండుగనాడు తెల్లవారుజామునే పురుషోత్తముడిని ‘ఉత్తిష్ఠ నరశార్దూలా..’ అంటూ నిద్రలేపి, పాలుమీగడలు ప్రసాదంగా సమర్పించి.. శ్రీదేవి భూదేవీ సమేతంగా విమాన ప్రాకారం చుట్టూ ఊరేగిస్తారు. విశ్వంభరుడైన స్వామికి పట్టు వస్ర్తాలను సమర్పిస్తారు. అనంతరం.. ఉగాది ఆస్థానం ఘనంగా జరుగుతుంది. త్రిలోకాధిపతి, త్రికాలజ్ఞాని పంచాంగ శ్రవణంలో పాల్గొంటాడు. ‘స్వామివారికి ఆదాయం ఎంతో?’ అమ్మవారి తరపు అర్చకస్వామి అబ్బురంగా అడుగుతాడు. ‘మా శ్రీవారు లక్ష్మీదేవినే గుండెల్లో పెట్టుకున్నారు. సంపదలకు కొదవేమిటీ?’ అయ్యవారి తరపు అర్చకస్వామి గడుసుగా జవాబిస్తాడు. ‘మరి వ్యయం మాటేమిటో?’ మరొక ప్రశ్న. ‘మా దేవుడిది చాలా పెద్ద చెయ్యి. కుబేరుడికి కుబేరత్వం ఇచ్చాడు.హనుమను భవిష్యత్ బ్రహ్మను చేశాడు…’ అంటూ శ్రీనివాస వైభవాన్ని వివరిస్తాడు. కలియుగ వైకుంఠ వాసుడి ఉగాది కొలువులో పాల్గొనడానికి ముక్కోటి దేవతలు సూక్ష్మ రూపాల్లో వస్తారని వినికిడి.