నాలుగు రాళ్లు సంపాదించడం గొప్పకాదు. తినే అన్నంలోంచి నాలుగు ముద్దలు పక్కవాడికి పెట్టడం గొప్ప. అంతటి ఔదార్యం ఉన్న మహిళ బెంగళూరుకు చెందిన ప్రేమా లాజరస్. ఈమె తన భర్త శివాజీతో కలిసి 2011లో ‘మిరాకిల్ మన్నా మినిస్ట్రీ’ పేరుతో ఒక ఆశ్రమాన్ని ఏర్పాటు చేసి, 23మంది అనాథ పిల్లలను అక్కున చేర్చుకున్నారు. కరోనా మహమ్మారి వీళ్లనూ వదిలిపెట్టలేదు. అటు దాతల నుంచి సాయం ఆగిపోయింది. ఇటు శివాజీ డ్రైవర్ ఉద్యోగమూ పోయింది. కుటుంబంతోపాటు ఆ ఆనాథ పిల్లలూ కష్టాలపాలయ్యారు. ప్రేమ తన నగలను అమ్మితే వచ్చిన ఐదు లక్షల రూపాయలతో ఆశ్రమాన్ని ఏడాదిపాటు నడిపారు.
ఇప్పుడు, మళ్లీ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఈ పరిస్థితుల్లో గివ్ ఇండియా సంస్థ క్రౌడ్ ఫండింగ్ క్యాంపెయిన్తో ఆదుకుంది. ఆ పిలుపునకు ఎంతోమంది స్పందించారు. అతి తక్కువ సమయంలోనే మొత్తం రూ.53 లక్షలు జమయ్యాయి. క్యాంపెయిన్ టార్గెట్ మొత్తం రూ.66 లక్షలు. ఎందుకంటే, మిరాకిల్ మన్నాలో ఉన్న పిల్లలు ఎలాంటి లోటు లేకుండా కనీసం రెండేండ్లు హాయిగా గడపాలంటే ఆ మాత్రం డబ్బు అవసరం.