యాదాద్రి, జూన్24: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో గురువారం అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయాన్నే ఆలయాన్ని తెరిచిన అర్చకులు స్వామి, అమ్మవార్లను అభిషేకించారు. తులసీదళాలతో అర్చించి అష్టోత్తర పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఆలయ మండపంలో శ్రీసుదర్శన నారసింహహోమం, స్వామి వారి నిత్యకల్యాణాన్ని వైభవంగా జరిపించారు. కొండపైన ఉన్న పర్వతవర్ధినీ సమే త రామలింగేశ్వరుడికి అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. పార్వతీదేవిని కొలుస్తూ కుంకుమార్చన జరిపారు. కొండ కింద భక్తులు పుణ్యస్నానం ఆచరించారు. రాత్రి బాలాలయంలోని ప్రతిష్ఠామూర్తులకు ఆరాధన, సహస్రనామార్చన నిర్వహించారు. సత్యనారాయణ స్వామివారి వ్రత పూజల్లో భక్తులు పాల్గొన్నారు. సామూహిక వ్రతాలూ జరిగాయి.
శ్రీవారి ఖజానాకు రూ. 7,00,877 ఆదాయం
శ్రీవారి ఖజానాకు రూ.7,00,877 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో గీత తెలిపారు. ప్రధాన బుక్కింగ్ ద్వారా రూ. 89,108, రూ.100 దర్శనంతో రూ.34,000, క్యారీ బ్యాగులతో రూ.2,750, సత్యనారాయణ స్వామి వ్రతాల ద్వారా రూ.41,000, కల్యాణకట్టతో రూ.13,540, ప్రసాద విక్రయంతో రూ. 3,17,995, శాశ్వతపూజల ద్వారా రూ. 15,116, వాహన పూజలతో రూ.5,300, టోల్గేట్తో రూ.1,550, అన్నదాన విరాళంతో రూ.11,202, సువర్ణ పుష్పార్చనతో రూ.72,660, యాదరుషి నిలయంతో రూ.51,700, పాతగుట్ట ద్వారా రూ.15,840, టెంకాయల విక్రయాలతో రూ. 24,000, ఇతర విభాగాలతో రూ. 5,116 కలుపుకొని రూ. 7,00,877 ఆదాయం సమకూరినట్లు ఆమె తెలిపారు.
మహాద్భుతంగా ఆలయ నిర్మాణం
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయ పునర్నిర్మాణ పనులు మహాద్భుతంగా జరుగుతున్నాయని భారత్లోని నేపాల్ దేశ శాంతి రాయబారి డాక్టర్ రామ్తిలక్ అన్నారు. గురువారం ఆయన స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూ జలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆయనకు స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు. అనంతరం ఆలయ నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశంలో కొవిడ్ మహమ్మారి అంతరించిపోవాలని స్వామివారిని వేడుకున్నట్లు ఆయన తెలిపారు.
కొనసాగుతున్న ఆలయ మెట్ల పనులు..
యాదాద్రీశుడిని కాలినడకన దర్శించుకునే భక్తుల కోసం ఆలయ మెట్లను వైటీడీఏ అధికారులు నిర్మిస్తున్నారు. గురువారం యాదాద్రి ప్రధానాలయం వద్ద ఉన్న ప్రసాద విక్రయశాల ఎదుట మెట్ల నిర్మాణం కోసం పూడికతీత పనులు చేపట్టారు. యాదాద్రీశుడికి మొ క్కులు చెల్లించుకునేందుకు చాలామంది భక్తులు కాలినడక వస్తుంటారు. వారికి పాదయాత్రలో ఎలాంటి ఇబ్బందులు ఉండకుండా సువిశాలంగా మెట్లను నిర్మిస్తున్నారు. అంతేకాకుండా మెట్ల మధ్యలో సేదతీరేందుకు రెండు విశ్రాంతి గదులను సైతం నిర్మిస్తున్నారు. కొండకింద గల స్వా మివారి వైకుంఠ ద్వారం నుంచి కొండపైకి మొ త్తం 365 శ్రీవారి మెట్లను నిర్మిస్తుండగా దాదాపుగా పనులు తుది దశకు చేరుకున్నాయి.