ఆలేరు టౌన్, మే 6 : గ్రామీణ ప్రాంతాల్లోని పేద కుటుంబాల పిల్లలు చదువుకోవాలంటే కేవలం ప్రభుత్వ పాఠశాలలే ఆధారం. అవి కూడా తమ గ్రామంలో ఉంటే సరి. లేకపోతే పక్క గ్రామానికి వెళ్లి చదువుకోవాలి. ఇలాంటి కష్టాలు పడే సమయం, తగిన ఆర్థిక స్థోమత ఈ కుటుంబాలకు ఉండదు కావున చాలా మంది ఇంటికే పరిమితమవుతున్నారు. వీరు కూడా అక్షరాస్యులు కావాలనే ఉద్దేశంతో ప్రభుత్వం గురుకులాలకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ఆలేరులో గత ఐదేండ్ల కిందట ఇంగ్లిష్ మీడియం మైనారిటీ గురుకుల పాఠశాల(బాలికల)ను ఏర్పాటు చేశారు. 2021-22 విద్యా సంవత్సరానికి 5వ తరగతితోపాటు 6 నుంచి 8 తరగతుల్లో మిగిలిన సీట్లను భర్తీ చేసేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. నాణ్యమైన విద్యతోపాటు చక్కటి వసతి, కార్పొరేట్ స్థాయి ప్రమాణాలతో విద్యా బోధన అందిస్తున్నారు. 5వ తరగతిలో 80 సీట్లు, 6వ తరగతిలో 16, 7వ తరగతిలో 24, 8వ తరగతిలో 26 సీట్లకు దరఖాస్తులను ఆన్లైన్ ద్వారా స్వీకరిస్తారు. అయితే ఇందులో 5వ తరగతిలో 51 సీట్లు ముస్లింలకు మిగతా 29 సీట్లు నాన్ మైనారిటీ వారికి కేటాయించారు. ఈ నెల 20వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి. అయితే విద్యార్థులకు ఉచిత విద్య, హాస్టల్ వసతి, బలవర్ధకమైన పోషకాహారం, క్రీడలు, డిజిటల్ తరగతులతోపాటు మైనారిటీ విద్యార్థుల కోసం ప్రత్యేకంగా నమాజు చేసేందుకు హాల్, వివిధ కళల్లో శిక్షణ ఇస్తున్నారు. ప్రావీణ్యం ఉన్న ఉపాధ్యాయులచే విద్యాబోధన అందిస్తున్నారు. మైనారిటీ గురుకులాలు నాణ్యమైన బోధనకు చిరునామాగా నిలుస్తున్నాయి. క్రీడలపై ఆసక్తి పెంచేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలో భువనగిరి, చౌటుప్పల్లో బాలుర మైనారిటీ గురుకులాలు(10+2) కొనసాగుతున్నాయి.
ఆన్లైన్లో దరఖాస్తులు
5వ తరగతిలో ప్రవేశాలు పొందగోరే విద్యార్థులు 1 సెప్టెంబర్ 2009 ముందుగాని, 31 ఆగస్టు 2012 తరువాత గానీ జన్మించి ఉండరాదు. 6వ తరగతిలో ప్రవేశాలు పొందే విద్యార్థులు 1 సెప్టెంబర్ 2008కి ముందుగాని, 31 ఆగస్టు 2011 తరువాత గాని జన్మించి ఉండరాదు. 7వ తరగతిలో ప్రవేశాలు పొందే విద్యార్థులు 1 సెప్టెంబర్ 2007 ముందుగానీ.. 31 ఆగస్టు 2010 తరువాత గానీ జన్మించి ఉండరాదు. 8వ తరగతిలో ప్రవేశాలు పొందే విద్యార్థులు 1 సెప్టెంబర్ 2006కు ముందుగానీ.. 31 ఆగస్టు 2009 తరువాత గానీ జన్మించి ఉండరాదు. గ్రామీణ ప్రాంతాల విద్యార్థుల తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.లక్షా 50వేల లోపు, పట్టణ ప్రాంతాలకు సంబంధించిన వారికి వార్షిక ఆదాయం రూ.2లక్షల లోపు ఉండాలి. ఆన్లైన్లోhttp://www.tmreis.telanga na.gov.inలో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు వెంట కులం, ఆదాయం, ఆధార్ కార్డు, పాస్పోర్టు సైజు ఫొటోలు పొందుపర్చాలి. లక్కీడ్రా ద్వారా ఎంపిక చేస్తారు.
సంస్థ ఆశయం
మైనారిటీ బాలబాలికలకు వేర్వేరుగా గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేసింది. వీరికి నాణ్యమైన విద్యను అందించేందుకు స్వయం ప్రతిపత్తి గల ప్రత్యేకమైన తెలంగాణ మైనారిటీస్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూట్ సొసైటీని ఏర్పాటు చేసింది. రాష్ట్రంలోని వెనుకబడ్డ మైనారిటీ బాలబాలికలను ప్రభుత్వ, ప్రైవేటు సంస్థ, పబ్లిక్ రంగ సంస్థల్లో ఉపాధి పొందేందుకు వీలయ్యే విధంగా విద్యారంగంలో ఉత్తమ అవకాశాలు కల్పించాలనే సంకల్పంతో ప్రభుత్వం ముందుకు వెళుతుంది. అంతే కాకుండా నేటి పరిస్థితులకు అనుగుణంగా విద్యార్థులను అన్ని పోటీ పరీక్షలకు దీటుగా ఎదుర్కొనేందుకు వీలుగా తీర్చిదిద్దుతున్నారు.