యాదాద్రి : యాదాద్రి లక్ష్మీసమేతుడైన నరసింహస్వామి దర్శనానికి భక్తులు అధిక సంఖ్యలో రావడంతో మండపాలు కిక్కిరిసిపోయాయి. ధనుర్మాసంతో పాటు ఆదివారం సెలవుదినం కావడంతో ఇలవేల్పు దర్శనం కోసం భక్తులు యాదాద్రిలో పోటెత్తారు. ఎటు చూసినా.. క్షేత్ర సందర్శనకు వచ్చిన భక్తులే కనిపించారు. కొండ కిందగల కల్యాణకట్ట, కొండపైన ప్రసాదాల విక్రయశాల, తిరు వీధులు భక్తులతో సందడిగా మారాయి. ఉదయం స్వామివారికి తలనీలాలు సమర్పించి, స్నానమాచరించిన భక్తులు క్షేత్ర పాలకుడైన ఆంజనేయస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. రద్ధీ దృష్ట్యా కొండపైకి ద్విచక్ర వాహనాలను అనుమతించ లేదు. స్వామివారి దర్శనానికి 3గంటల వరకు సమయం పట్టింది.
ప్రత్యేక పూజల కోలాహలం..
ధనుర్మాసం సందర్భంగా స్వామి అమ్మవార్లకు ఉదయమే ప్రత్యేక పూజలు చేశారు. ఆర్జిత పూజల కోలాహలం తెల్లవారు జాము మూడు గంటల నుంచి మొదలైంది. నిజాభిషేకంతో ఆరాధనలు ప్రారంభించారు. ఉత్సవ మూర్తులకు అభిషేకం జరిపారు. ఉదయం మూడు గంటలకు సుప్రభాతం నిర్వహించిన అర్చకులు లక్ష్మీనరసిండిని ఆరాధిస్తూ ప్రత్యేక పూజలు చేశారు. హారతి నివేదనలు అర్పించారు. సుదర్శన హోమం ద్వారా శ్రీవారిని కొలిచారు. సుదర్శన ఆళ్వారును కొలుస్తూ హోమం జరిపారు. ప్రతీ రోజు నిర్వహించే నిత్యకళ్యాణోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. లక్ష్మీసమేతుడైన నారసిండిని ఆరాధిస్తూ సుమారు గంటన్నరకు పైగా కళ్యాణ తంతును జరిపారు.
కల్యాణ మూర్తులను ముస్తాబు చేసి బాలాలయ ముఖమండపంలో భక్తులకు అభిముఖంగా అధిష్టించి కల్యాణ తంతును నిర్వహించారు. సాయంత్రం వేళ అలంకార జోడు సేవలు నిర్వహించారు. మండపంలో అష్టోత్తర పూజలు జరిపారు. ధనుర్మాసం సందర్భంగా సత్యనారాయణస్వామి వ్రతాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కుటుంబ సమేతంగా వ్రతాలను ఆచరించి, స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
యాదాద్రీశుడిని దర్శించుకున్న ప్రముఖులు..
యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామివారిని ఎమ్మెల్సీ సురభి వాణిదేవి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. గొర్రెలు, మేకల అభివృద్ధి సంస్థ చైర్మన్ డాక్టర్ దూదిమెట్ల బాలరాజుయాదవ్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వారికి స్వామివారి వేద ఆశీర్వచనం అందజేసి, ప్రసాదం అందజేశారు. వీరితో పాటు ప్రజాగాయకుడు గద్దర్ దర్శించుకుని ఆలయ నిర్మాణాలను పరిశీలించారు.